హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జీహెచ్ఎంసీయేతర ప్రాంతాల్లో 287లక్షల చదరపుఅడుగుల్లో కూల్రూఫ్ పాలసీని అమలు చేయాలని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ లక్ష్యంగా నిర్ణయించింది. రాష్ట్రంలో 3468 వార్డులు ఉండగా 77.01 లక్షల జనాభా ఉన్నది, వీటి ల్లో 287లక్షల చదరపుఅడుగుల్లో ఈ సంవత్సరం కూల్రూఫ్ పాలసీని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇది 2,675 చదరపు కిలోమీటర్లతో సమానం. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా వివిధ మున్సిపాలిటీలకు టార్గెట్ నిర్ణయించి మున్సిపల్ కమిషనర్లకు శనివారం సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. ఎండ వేడి పరావర్తనం చెందే పెయింట్ మాత్రమే వేయాలని సూచించారు. టైల్స్ కూడా వేయవచ్చని తెలిపారు.
600 గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే ప్రతి భవనానికి ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాన్నింటికీ, ప్రభుత్వం సహాయం చేసే నిర్మాణాలకు సైతం ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. నివాసేతర నిర్మాణాలు, వాణిజ్య భవనాలు ఎంత విస్తీర్ణంలో నిర్మించినా కూల్రూఫ్ పాలసీ వర్తిస్తుందని పేర్కొన్నారు.
కూల్రూఫ్ పాలసీపై ప్రజల్లో మరింత అవగాహన, చైతన్యం తీసుకురావటానికి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సేవాసంస్థలు, స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. సోషల్ మీడియా, ట్రేడ్ షోలు, సదస్సులు, సమావేశాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని పిలుపునిచ్చారు. టీఎస్బీపాస్లో అనుమతుల్లో తప్పనిసరిగా కూల్రూఫ్ పాలసీని అమలు చేయాలనే నిబంధన పెడుతున్నట్టు చెప్పారు.