Atal Pension Yojana | హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): అటల్ పెన్షన్ యోజన(ఏపీవై) పథకంపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు తెలిపారు. ఏపీవై పథకంపై కేంద్రానికి చిత్తశుద్ధి లోపించిందని మండిపడ్డారు. అమలు తీరు, సభ్యుల సంఖ్య పెరుగుదలకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై కేంద్రాన్ని సోమవారం లోక్సభలో నామ ప్రశ్నించారు. అటల్ పెన్షన్ యోజన పథకం నిధుల వివరాలు వెల్లడించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకానికి నిధులు ఏ మేరకు సమకూరుస్తుందో తెలియజేయాలని, రాష్టాల వారీగా సమగ్ర సమాచారం అందించాలన్నారు. ఐదేండ్లుగా రాష్ర్టాలకు కేటాయించిన నిధుల వివరాలు ఇవ్వాలని కోరారు. పథకం కింద కనీస పెన్షన్ను పెంచడానికి, ఎకువ మంది సభ్యులు చేరి, ప్రయోజనం పొందేలా ప్రోత్సహించడానికి ఏదైనా ప్రతిపాదన ఉందా? అని ఎంపీ నామ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అయితే 2021, 2022, 2023 సంవత్సరాల్లో పథకానికి ప్రభుత్వ కో కంట్రిబ్యూషన్ నిధులు ఎందుకు కేంటాయించలేదని కేంద్రాన్ని నిలదీశారు. చివరికి… పెన్షన్ ఆస్తుల మధ్య అంతరాన్ని పూడ్చేందుకు ఉద్దేశించిన గ్యాప్ ఫండ్కు కూడా నిధులు కేటాయించకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తుందన్నారు. పెన్షన్ సబ్ స్రిప్షన్ మొత్తాన్ని పెంచడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు. సభ్యులు ఎంచుకున్న ఆధారంగా కనీస హామీ పెన్షన్ను అందిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరాద్ సమాధానమిచ్చారు. పథకానికి సంబంధించిన కో కంట్రిబ్యూషన్ నిధులు, బ్యాంకులకు ప్రోత్సహక చెల్లింపులు చేస్తున్నట్లు చెప్పారు. వేరే చట్టబద్ధ సామాజిక భద్రతా పథకంలో సభ్యులు కాని వారిని, ఆదాయపు పన్ను కట్టకుండా అర్హత ఉన్న వారిని ఇందులో సభ్యులుగా చేర్చుకున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. అయితే.. కేంద్రం రాష్ర్టాల వారీగా సమగ్ర సమాచారం ఇవ్వకపోవడంపై ఎంపీ నామ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.