జమ్మికుంట, ఆగస్టు10: ‘ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇక యాక్షన్ చేసే నాయకుడు వస్తడు. మీ మధ్య చేరి నటిస్టడు. నమ్మితే మోసపోవడం ఖాయం’ అని మండలి విప్, బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పాడి కౌశిక్రెడ్డి ప్రజలకు సూచించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన వ్యక్తి, జమ్మికుంటలో వరద కోసం శాశ్వత పరిష్కారం చూపలేని నాయకుడు మనకు అవసరమా..? అన్ని ప్రశ్నించారు.
‘మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి.. ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని’ స్పష్టం చేశారు. జాతీయ చేనేత దినోత్సవంలో భాగంగా కరీంనగర్ జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. స్వరాష్ట్రంలో చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని, పద్మశాలీ కులస్థుల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నామని చెప్పారు.
నాడు ఇతర రాష్ర్టాలకు వలసలు పోయిన చేనేత కార్మికులు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాపస్ అయ్యారని, సీఎం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో గొప్పగా బతుకుతున్నారని పేర్కొన్నారు.
కేసీఆర్ ఆలోచనలు అన్ని వర్గాల సర్వతోముఖాభివృద్ధికి దోహదం పడుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వాలు చేనేత రంగాన్ని పట్టించుకున్న పాపానపోలేదని, నేడు రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి పెద్దపీట వేస్తున్నదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏడీ సంపత్, డీఎంవో జనార్ధన్, డీవోలు శ్రీకాంత్రెడ్డి, అనిత, ఏడీవో శాంత, డీసీసీబీ డైరెక్టర్ కృష్ణప్రసాద్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, జడ్పీటీసీ డాక్టర్ శ్యాం, పీఏసీఎస్ చైర్మన్ సంపత్, సంఘాల చైర్మన్లు, నాయకులు సత్యనారాయణ, సర్వేశం, రాంచంద్రం, శ్రీకాంత్, రమేశ్, ఉపేందర్, తిరుపతి, సత్యనారాయణరావు, ఎంఈవో శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులుపాల్గొన్నారు.