హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై సోషల్ మీడియాలో పది రోజులుగా సెటైర్లు పేలుతుండగా.. ఇప్పుడు ఏకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ‘తెలంగాణ మధ్య తరగతి ప్రజలు’ పేరుతో హైదరాబాద్లో పలుచోట్ల ఈ ఫ్లెక్సీలు కనిపించాయి. ‘అమృత్ కాల్ బడ్జెట్ సమర్పించినందుకు థ్యాంక్యూ మోదీ జీ’ అని ఒక ఫ్లెక్సీలో ఉండగా.. దాని పక్కనే ‘అమృత్ కాల్ బడ్జెట్ కాదు.. కాళకూట బడ్జెట్’ అని మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. బైబై మోదీ అంటూ కొసమెరుపు ఇచ్చారు. ఫ్లెక్సీల్లోని కార్టూన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నది. మొత్తంగా మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం కాగా, ప్రజలు ఆర్థికంగా చితికిపోయారని అర్థం వచ్చేలా ఈ పోస్టర్లు వెలిశాయి. ఈ నెల 13న ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు కట్టడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఆ వైపు వెళ్తున్న వాహనదారులు ఆసక్తిగా గమనిస్తున్నారు.