హైదరాబాద్ ఆగస్టు 22 (నమస్తేతెలంగాణ) : సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దు వెనుక రహస్యమేంటో చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. తెలంగాణభవన్లో శనివారం పార్టీ సీనియర్ నేతలు అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, ఉపేంద్రాచారితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీని కలువాలని నిర్ణయించడంతోనే కేంద్రం పర్యటనకు నిరాకరించిందని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ప్రచారం జరుగుతున్నదని పేర్కొన్నారు. అదే నిజమైతే సీఎం అధికారిక పర్యటన షెడ్యూల్లో మమ్దానీ పేరు ఎందుకు చేర్చలేదని నిలదీశారు. అసలు రేవంత్రెడ్డి మమ్దానిని కలిసేందుకు వెళ్లారా? అమ్దానీ కోసం వెళ్లారో అర్థం కావడం లేదని దెప్పిపొడిచారు. సీఎం రేవంత్ అమెరికాలో ఎవరిని కలువాలనుకున్నారని, కేంద్రం ఎందుకు అడ్డుకున్నదనే విషయం ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు.
సీఎం హోదా, పర్యటన ఉద్దేశానికి అనుగుణంగా లేని సమావేశాలు ఏంటని, కేంద్ర విదేశాంగ కార్యదర్శి చెప్పినట్టుగా ఇనాప్రొప్రియేట్ పదానికి అర్థమేంటని ప్రశ్నించారు. 2024లో అమెరికా పర్యటనకు సీఎం రేవంత్రెడ్డికి అనుమతి ఇచ్చిన కేంద్రం, ఇప్పుడు అభ్యంతరం చెప్పడంలోని అంతర్యమేంటని నిలదీశారు. ఈ పర్యటన రాష్ర్టానికి పెట్టుబడుల కోసమా? స్వప్రయోజనాల కోసమా అనే అనుమానం కలుగుతున్నదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటన రద్దు చేయడం రాష్ట్రంలోని నాలుగుకోట్ల ప్రజలకు అవమానకరమని వ్యాఖ్యానించారు. రేవంత్రెడ్డి విదేశాల్లో హవాలా దందా చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ఏం పాలసీలు స్టడీ చేసేందుకు యూనివర్సిటీలకు వెళ్తున్నారో తెలియడంలేదని విమర్శించారు. బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఆలయాలకు వెళ్తే ఫొటోలు ఎందుకు పెట్టలేదని, వివరాలు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్న కాంగ్రెస్ నాయకులు, మరీ సీఎం అధికారిక విదేశీ పర్యటన షెడ్యూల్లో స్పష్టత ఎందుకివ్వలేదని నిలదీశారు .