హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం.. రాష్ర్టానికి ఇచ్చిన హామీలను నెరవేర్చటం లేదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. కాజీపేటలో రైల్వే కోచ్ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అనేకసార్లు కేంద్రాన్ని కోరారని గుర్తుచేశారు.
శుక్రవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ వద్దిరాజు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశంతో పాటు తెలంగాణలో రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ కోసం కేంద్రం తీసుకొంటున్న చర్యలు ఏమిటని ప్రశ్నించారు. కాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీని ఎప్పుడు ఏర్పాటు చేస్తారని నిలదీశారు.
కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీతో తెలంగాణ ప్రజల మనోభావాలు ముడిపడి ఉన్నాయని చెప్పారు. దీనిపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ సమాధానాన్ని దాటవేశారు. దాంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలపై కేంద్రానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదనేది మరోసారి తేటతెల్లమైందని వద్దిరాజు పేర్కొన్నారు.