హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): జాతీయ రహదారులపై చట్ట వ్యతిరేకంగా వాహనాలను నిలిపి ఉంచడం వల్ల జరిగే ప్రమాదాల నివారణకు తీసుకునే చర్యలను వివరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు కోరింది. ఆరు వారాల్లోగా సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొన్నది. నిజామాబాద్-కామారెడ్డి హైవేపై అక్రమంగా వాహనాల పార్కింగ్ వల్ల తన కుమార్తె మరణించిందని పేర్కొంటూ నాగరాజు అనే వ్యక్తి రాసిన లేఖను హైకోర్టు వ్యాజ్యంగా పరిగణించి బుధవారం విచారణ చేపట్టింది.
2021లో తన కుటుంబం నిజామాబాద్ నుంచి కామారెడ్డికి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో మరణిచిందని తెలిపారు. ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాథే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్తో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ప్రతివాదులైన కేంద్ర రవాణా శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రోడ్లు భవనాల శాఖలకు నోటీసులు జారీ చేసింది. విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.