యాదాద్రి, జూలై 21 : యాదగిరిగుట్టపై ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద భక్తిభావం ఉట్టిపడేలా వైటీడీఏ అధికారులు స్వాగత తోరణాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారు. దాదాపు 92 శాతం పనులు పూర్తికాగా తుది మెరుగులు అద్దుతున్నారు. వారం రోజుల్లో ఈ స్వాగత తోరణం భక్తులకు అందుబాటులోకి రానున్నది. గుట్టపైకి వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు నిర్మించిన ప్రథమ, ద్వితీయ ఘాట్ రోడ్లు కలిసే ప్రదేశంలో 40 ఫీట్ల ఎత్తు, 20 ఫీట్ల వెడల్పుతో రెండు మార్గాలు ఉండేలా దీన్ని తీర్చిదిద్దారు.
భక్తులు మొదటి ఘాట్రోడ్డు నుంచి కొండకు వచ్చే విధంగా, రెండో ఘాట్ రోడ్డు నుంచి తిరిగి కొండ కిందికి వెళ్లే విధంగా వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేశారు. స్వాగత తోరణంపై సాలహారాలను ఏర్పాటు చేసి అందులో చక్కటి దేవతామూర్తులను రూపొందించారు. దీంతోపాటు కాకతీయ పిల్లర్లను నిర్మించడంతోపాటు వాటిపై సింహాకృతులు, ఐరావతాలు, గోపురాలను తీర్చిదిద్దారు. కలశాకృతులు, శంఖు చక్ర, తిరునామాలు, అద్భుతమైన కిటికీలు, కాకతీయ తోరణాలు, దేవతామూర్తులను ఏర్పాటు చేశారు. ఆర్చ్పై గల ప్రధాన సాలహారంలో లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్ల ప్రతిమలు భక్తులను ఎంతగానో ఆకట్టుకోనున్నాయి.