కారు చెట్టుకు ఢీకొనడంతో ఘటన
జడ్చర్ల టౌన్, ఫిబ్రవరి 10 : మరికొద్ది గంటల్లో పెండ్లి జరగాల్సి ఉండగా.. అంతలోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో వరుడు దుర్మరణం చెందారు. ఈ విషాదకర ఘటన మహబూబ్నగర్ జిల్లా నక్కల బండతండా సమీపంలో చోటుచేసుకొన్నది. మహబూబ్నగర్ పట్టణంలోని క్రిస్టియన్ కాలనీకి చెందిన చైతన్య అలియాస్ బబ్లూ(35) ప్రభుత్వ ఉపాధ్యాయుడు. నారాయణపేట జిల్లా తిర్మలాపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. వనపర్తికి చెందిన యువతి (ఏఈవో)తో చైతన్యకు వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం 11:30 గంటలకు మహబూబ్నగర్లోని ఎంబీ చర్చిలో పెండ్లి జరగాల్సి ఉన్నది. ఈ క్రమంలో తెల్లవారుజాము 5 గంటల సమయంలో జడ్చర్లకు వెళ్లేందుకు ఇంటి నుంచి కారులో బయల్దేరారు. కొద్దిసేపటికే జడ్చర్ల మండలం నక్కలబండ తండా సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో చైతన్య అక్కడికక్కడే మృతిచెందారు. జడ్చర్ల సీఐ రమేశ్బాబు, ఎస్సై శంషొద్దీన్ ఘటనా స్థలానికి చేరుకొని చైతన్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. ఈ ఘటనతో రెండిండ్లలో విషాదం నెలకొన్నది.