హైదరాబాద్ : రాష్ట్రాన్ని చలిపులి మరో మూడు రోజుల పాటు వణికించనుంది. రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ అంతటా మరో మూడు రోజులు తీవ్రంగా చలి ప్రభావం ఉండనున్నది. రాబోయే మూడు రోజులు శీతల గాలులు వణికించనున్నాయి. రెండు రోజులు పాటు సాధారణంగా నమోదైన ఉష్ణోగ్రతలు శుక్రవారం నుంచి తగ్గుతున్నాయి.
శని, ఆది, సోమ వారాల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోనున్నాయి. శుక్రవారం ఉదయం వరకు రాత్రి ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్, కొమ్రంభీమ-ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లలో 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యంత తక్కువగా ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి), లొకారి(కె)లలో 11. 7 డిగ్రీల సెల్సియస్ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత ఎక్కువగా ఖమ్మం జిల్లా పెనుబల్లిలో 34.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇక రాబోయే మూడురోజుల్లో కొన్ని జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోకి వచ్చే గాలులు దిశ మార్చుకొని శుక్రవారం నుంచి తూర్పు, ఈశాన్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.