హైదరాబాద్ సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): ‘మన ఊరు-మన చరిత్ర’కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని 12,769 గ్రామాల చరిత్రను ఆయా గ్రామాల్లోని విద్యార్థులు నమోదుచేసే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నదని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టిన ఈ కార్యక్రమాన్ని తొలుత నల్లగొండ జిల్లాలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో మార్చి 29న ప్రారంభించినట్టు తెలిపారు.
నల్లగొండ జిల్లాలోని 860 గ్రామాల చరిత్రను ఆ గ్రామాలకు చెందిన యువకులే రచిస్తారని పేర్కొన్నారు. ఇప్పటికే నల్లగొండ జిల్లాలో సుమారు 200 గ్రామాల చరిత్రను నమోదు చేయడం దాదాపు పూర్తయ్యిందని పేర్కొన్నారు. మే 12న ఖమ్మం జిల్లాలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజీలో చరిత్ర నమోదును ప్రారంభించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం చరిత్ర రచనకు కొత్తదారి వేస్తున్నదని చెప్పారు. తమ గ్రామాల్లోని కులాలు, మతాలు, పండుగలు, ఆటపాటలు, గంగాజమునా తెహజీబ్ సంస్కృతులను విద్యార్థులు లిఖిస్తారని వివరించారు. గ్రామం నుంచి ఉన్నతస్థాయికి ఎదిగిన వారి చరిత్ర, భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిన యోధులు, రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నవారి చరిత్రలను రాయాలని విద్యార్థులకు సూచించారు.
బీసీ గణనపై బీజేపీ స్పష్టత ఇవ్వకుండా.. ఒక్కసారి గెలిపించండి ప్లీజ్ అంటే సరిపోతుందా? అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. తెలంగాణ, ఏపీ బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ జనగణనపై కేంద్రప్రభుత్వ, బీజేపీ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. 2014కు ముందు బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దివంగత నేత సుష్మాస్వరాజ్ బీసీ జనగణన చేపట్టాలని పార్లమెంట్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండు చేశారని ఆయన గుర్తుచేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రమంత్రి రాజ్నాథ్సింగ్ సైతం బీసీ గణనకు తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారని శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి అమిత్షా బీసీ గణనపై మాట్లాడుకుండానే వెళ్లిపోయారని అన్నారు.