వికారాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాలతో అనంతగిరిలో కొవిడ్ హాస్పిటల్ ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అనంతగిరిలోని టీబీ హాస్పిటల్ను శుక్రవారం మంత్రి సందర్శించారు. అనంతరం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, కలెక్టర్ పౌసుమి బసు, రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్, జడ్పీ చైవిజయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, జిల్లా వైద్యాధికారి సుధాకర్ షిండే, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజులతో కలిసి కొవిడ్ పై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కరోనాపై అనునిత్యం సమీక్షిస్తూ ఆదేశాలు ఇస్తున్నారని అన్నారు. సీఎం స్వయంగా రెండు రోజుల క్రితం గాంధీ దవాఖాన, నేడు వరంగల్ ఎంజీఎంను సందర్శించి కరోనా రోగులకు మనో ధైర్యం కల్పించారని పేర్కొన్నారు. వైద్యులు, సిబ్బందిని ప్రోత్సహించి వారిలో మరింత ఆత్మస్థైర్యం నింపారన్నారు.
వికారాబాద్లో డ్రగ్ స్టోర్ను మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు మంత్రి సబితా రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఆర్టీపీసీఆర్ సెంటర్ త్వరలో ప్రారంభం కానుందని పేర్కొన్నారు. వికారాబాద్ లో నేటి నుంచి సిటీ స్కాన్ 2,500 రూపాయలకే చేయనున్నట్లు తెలిపారు.
ప్రయివేట్ హాస్పిటల్స్లో ఫీజుల నియంత్రణ కు కలెక్టర్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలను వసూలు చేయాలని మంత్రి ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలను ఆదేశించారు.
చిన్న పిల్లల కోసం కూడా ప్రత్యేక ఐసోలేషన్ సెంటర్ ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అనంతగిరిలో 200 పడకల దవాఖానలో ఆక్సిజన్ బెడ్లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
అనంతగిరిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న అనంతగిరిలో అన్ని వసతులతో దవాఖాన ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు.