ఖైరతాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : ఉపసర్పంచ్ల చెక్పవర్ రద్దు చేయాలన్న నిర్ణయాన్ని తక్షణమే ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని ఉపసర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇది రాష్ట్రంలోని 12,780 మంది ఉపసర్పంచ్ల భవితవ్యానికి సంబంధించిన అంశమని అన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమకార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
చెక్పవర్ రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తూ ఈ నెల 25న చలో హైదరాబాద్కు పిలుపునిచ్చామని, ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద జరిగే నిరసన కార్యక్రమానికి ఉపసర్పంచ్లు వేలాదిగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వహయాంలో సర్పంచ్లు, ఉపసర్పంచ్లకు ఉమ్మడి చెక్పవర్ ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంప్రదాయాన్ని దెబ్బతీసే ప్ర యత్నం చేస్తున్నదని ఉపసర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి కరుణాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు తెలంగాణ కోసం ఉద్యమించామని, ఇప్పుడు తమ ఆత్మగౌరవం కోసం కొట్లాడుతామన్నారు.