హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను దవాఖానలో చేర్పించి, ప్రాణాలు కాపాడే వారికి రూ. 25 వేల నగదు ప్రోత్సాహం అందజేస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. మంగళవారం ఖైరతాబాద్ రవాణా కార్యాలయంలో ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత ప్రతిజ్ఞను మంత్రి చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రత అనేది ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు.. ప్రజలది కూడా అని చెప్పారు. కార్యక్రమంలో రవాణాశాఖ స్పెషల్ సీఎస్ వికాస్రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, జేటీసీలు చంద్రశేఖర్ గౌడ్, రమేశ్, శివ లింగయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.