నిజామాబాద్ : నూతనంగా ఏర్పడిన భీంగల్ మున్సిపాలిటీని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దటమే లక్ష్యం అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూర్లోని మంత్రి క్యాంప్ ఆఫీస్లో భీంగల్ మున్సిపాలిటీ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మున్సిపాలిటీ పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యతతో రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనం, ఓపెన్ జిమ్లు, వైకుంఠధమాల పనుల పురోగతిపై, మున్సిపాలిటీలో ఏర్పాటు చేస్తున్న పబ్లిక్ టాయిలెట్లపై అంశాల వారీగా సమీక్షించారు.
లింబాద్రి గుట్ట వద్ద ఏర్పాటు చేయనున్న అర్బన్ పార్క్ పనులపై మంత్రి ఆరా తీశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ భగత్, కౌన్సిలర్లు, కన్నె సురేందర్, పార్టీ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్,మున్సిపాలిటీ ఇంచార్జి మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ రాజేందర్,పబ్లిక్ హెల్త్ ఈఈ మురళీ మనోహర్, ఏఈ రఘు తదితరులు పాల్గొన్నారు.