హైదరాబాద్ : దాసారం(Dasaram) గుడిసె వాసులకు పక్కా ఇండ్లను నిర్మించి ఇస్తామని సనత్నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) హామీ ఇచ్చారు. సోమవారం సనత్ నగర్లోని సాయిబాబా నగర్, దాసారం బస్తీ, దాసారం హట్స్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఆయనకు మహిళలు మంగళహారతులు పట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్బంగా దాసారం బస్తీ గుడిసె వాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. అత్యంత నిరుపేదలు నివసించే ఈ ప్రాంత ప్రజలకు ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తూ వచ్చామన్నారు.
స్థలం విషయం కోర్టులో కేసు నడుస్తుందని, తప్పకుండా కేసును మనమే గెలుస్తామని వారి ధైర్యం చెప్పారు. కేసు పరిష్కరమైన తర్వాత ఉచితంగా పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. మీకు ఏ అవసరమొచ్చిన తానున్నాను అనే విషయాన్ని మరవద్దని చెప్పారు. ఓట్ల కోసం ఎవరెవరో వచ్చి కల్లబొల్లి మాటలు చెబుతారని, వారి మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రచారంలో మంత్రి వెంట కార్పొరేటర్ కొలను లక్ష్మి, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొలను బాల్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ శేఖర్, నాయకులు సురేష్ గౌడ్, ఖలీల్, కర్ణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రమేష్ గౌడ్, ప్రవీణ్, రాజేష్, భద్రయ్య , పుష్పలత, ఝాన్సీ తదితరులు ఉన్నారు.