రంగారెడ్డి, జూలై 21 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలో పోలీసు పహారాలో భూసేకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. టీజీఐఐసీ ఆధ్వర్యంలో గతంలో సేకరించిన భూములకు సంబంధించి పలువురికి పరిహారం చెల్లించకుండానే అధికారులు భూసేకరణకు సిద్ధం కావడంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. భూసేకరణ చేసేందుకు వస్తున్న అధికారులను రైతులు ఎక్కడికక్కడే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. పోలీసుల సహకారంతో టీజీఐఐసీ అధికారులు ఫెన్సింగ్ పనులను పూర్తిచేస్తున్నారు.
కంచె వేస్తున్న ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. రైతులు ఆయా పొలాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటూ నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. బహదూర్గూడలోని 650 ఎకరాలకు సంబంధించి రైతులపై కేసులు నమోదు చేసిన పోలీసులు గ్రామంలోకి ఇతర గ్రామాల వారు ఎవరూ రాకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేసి.. ఆ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు. అలాగే, యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లోనూ పికెటింగ్లను ఏర్పాటుచేసి కంచె పనులు చేపడుతున్నారు. అలాగే, ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామంలోనూ గతం లో సేకరించిన భూములను స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేస్తున్నారు. భూ ములు కోల్పోయినవారికి ఇండ్ల స్థలాలు, ఇతర వసతులను కల్పించాలని రైతులు ఆందోళన చేస్తున్నా ఫలితం ఉండటంలేదు.
అడ్డుకుంటే అక్రమ కేసులు..
పోలీసుల సహకారంతో భూములను స్వాధీ నం చేసుకోవడాన్ని నిరసిస్తూ పలు గ్రామాల్లో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. బహదూర్గూడలో భూసేకరణను అడ్డుకున్న పలువురు గిరిజన మహిళా రైతులపై పోలీసులు నాన్బెయిలెబుల్ కేసులు నమోదు చేశారు. అలాగే, ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలతోపాటు మరో 50 మంది రైతులపైనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నేపథ్యంలో రైతులు ఎక్కడ అడ్డుకున్నా వెంటనే వారిని అరెస్టు చేసేందుకు ఎక్కడికక్కడ పోలీసు పికెటింగ్లను ఏర్పాటు చేశారు.
కొనసాగుతున్న పోలీసుల జులుం..
తాతలకాలం నుంచి భూములను సాగుచేసుకుని జీవిస్తున్న రైతులను పోలీసులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. తమ భూములను బలవంతంగా తీసుకోవద్దంటూ రైతులు పలు రకాలుగా వేడుకుంటున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవటంలేదు. అడ్డొచ్చిన రైతులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఎక్కడికక్కడే రైతులను నిర్బంధించి కంచె పనులు పూర్తిచేస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన పరిహారం, ఇతరత్రా సదుపాయాలు రాకుండానే ఫెన్సింగ్ ఎలా వేస్తారని రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ తీరుపై నిరసన జ్వాలలు..
ప్రభుత్వం ఏకపక్షంగా రైతుల నుంచి భూములను స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా బాధిత రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లాలో వేలాది ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.