హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన ఎస్టీ రిజర్వేషన్లను 10శాతానికి పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్వాగతించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదివాసీ, గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా న్యాయమైన వాటా అందించేందుకు ప్రభుత్వ తీసుకొన్న ఈ నిర్ణయం ఒక ముందడుగు అని కొనియాడారు. గతంలో అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రప్రభుత్వం బేఖాతరు చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఎస్టీ రిజర్వేషన్లను పెంచడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇటీవల జారీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లలో రిజర్వేషన్ పెంపు నిర్ణయం త్వరలో జారీచేసే జీవోలో అమలయ్యేలా చూడాలని కోరారు. పోడు సాగుదారుల సమస్యను కూడా పరిష్కరించాలని ముఖ్యమంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు.