హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా జవహర్నగర్ బాధితురాలికి అండగా ఉంటామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి భరోసా ఇచ్చారు. చైర్పర్సన్ ఆదేశాల మేరకు బుధవారం బాధితురాలి ఇంటికి కమిషన్ సభ్యురాలు ఉమాదేవి, ఇన్వెస్టిగేషన్ అధికారి శారద వెళ్లి పరామర్శించారు. బాధితురాలితో చైర్పర్సన్ ఫోన్లో మాట్లాడి మనోధైర్యం కల్పించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామని పేర్కొన్నారు.
తల్లిస్థానంలో ఉండి ఒక మహిళే ఘోరాన్ని ఆపకుండా నిందితుడికి సహకరించడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన సమయంలో పరిసర ప్రాంత ప్రజలు ప్రేక్షకపాత్ర వహించడం ఆవేదనను కలిగిస్తున్నదని వాపోయారు. బాధితురాలికి అవసరమైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సఖి ప్రతినిధులకు సూచించారు. నిందితుడి అరెస్టు విషయంలో తక్షణమే పోలీస్ స్పందించారని, ఘటనపై సమగ్ర విచారణ నివేదిక సమర్పించాలని పోలీస్ శాఖను ఆదేశించారు. మహిళలందరికీ కమిషన్ అండగా ఉంటుందని తెలిపారు.