నిజామాబాద్ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ పాలనకు ప్రజలు వెన్నుదన్నుగా నిలవాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం చారిత్రాత్మక ప్రగతిని సంతరించుకుంటోందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, రాష్ట్ర చరిత్రలోనే ఇదివరకెన్నడూ జరగలేదని అన్నారు. పల్లెల ప్రగతికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. వానాకాలంలో కురిసిన వర్షాల వల్ల లోలెవల్ కాజ్ వేలు దెబ్బతిని రవాణా పరంగా ఇబ్బందులు ఏర్పడిన విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానన్నారు.
దీంతో భీంగల్ మండలానికి మూడు హై లెవెల్ బ్రిడ్జిలు మంజూరు చేశారని తెలిపారు. గతంలో రెండు వందల రూపాయలకే పరిమితమైన ఆసరా పెన్షన్లను రెండు వేల రూపాయలకు పెంచామని, దివ్యాంగులకు మూడు వేల పెన్షన్ ను నెలనెలా అందిస్తున్నామని గుర్తు చేశారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా లక్ష రూపాయల చొప్పున ఆర్థిక తోడ్పాటును సమకూరుస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాస్, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్ రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మొయీజ్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.