హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘వీ-హబ్’లో మూడో ఇంక్యుబేషన్ ప్రోగ్రాం ప్రారంభమైంది. ఇందుకోసం మహిళల నేతృత్వంలో ప్రారంభమైన 26 అర్బన్-టెక్ స్టార్టప్లను ఎంపిక చేసింది. ఇందులో ఆరోగ్యం, విద్య, సుస్థిరాభివృద్ధి, కన్జ్యూమర్ టెక్, డీప్టెక్, ఎఫ్ఎంసీజీ తదితర రంగాలకు చెందిన స్టార్టప్లు ఉన్నాయి. ఇవి ఆయా రంగాల్లో ఎదుర్కొంటున్న సమస్యలకు ఎంపిక చేసిన స్టార్టప్లు వినూత్న పరిష్కార మార్గాలు చూపేలా వీ-హబ్ ప్రోత్సహించనున్నది. తొమ్మిది నెలలపాటు సాగనున్న ఇంక్యుబేషన్ ప్రోగ్రాంను గురువారం లాంచ్ చేశారు. ఎంపికైన స్టార్టప్లకు, వీ-హబ్ బృందానికి ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏటా పదుల సంఖ్యలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు ముందుకొస్తుండటం, భిన్న రంగాల్లో స్టార్టప్లు ప్రారంభిస్తుండటం చాలా సంతోషంగా ఉన్నదన్నారు. ఎంపికైన స్టార్టప్లు తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా మంచి ఎకో సిస్టమ్ను తయారు చేయాలని ఆకాంక్షించారు. వీ-హబ్ సీఈవో దీప్తి రావుల మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల నుంచి 26 స్టార్టప్లను ఎంపిక చేసినట్టు చెప్పారు. వీ-హబ్ మూడేండ్ల ప్రయాణంలో దాదాపు అన్ని రంగాలకు సంబంధించిన స్టార్టప్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, ఇది తమకు ఎంతో సంతోషంగా ఉన్నదని చెప్పారు. వీ-ట్రేడ్, లాంచ్ప్యాడ్, వీ-కార్నర్ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా వీ-హబ్ మిగతా ఇంక్యుబేటర్ల కన్నా భిన్నంగా నిలిచిందని చెప్పారు.
వీ-హబ్ ఇంక్యుబేషన్ ప్రోగ్రాంకు దేశవ్యాప్తంగా 101 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 90 శాతం స్టార్టప్లు మహిళలే సొంతంగా ప్రారంభించినవి కావడం విశేషం. వీ-హబ్ బృందం వీటిని వడబోసి 26 స్టార్టప్లను ఎంపిక చేసింది. తెలంగాణతోపాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి స్టార్టప్లు ఎంపికయ్యాయి. వీరికి నిపుణుల మార్గనిర్దేశనంతోపాటు స్టార్టప్లను ఎలా అభివృద్ధి చేయాలి, నిధులను ఎలా సమీకరించాలి? ప్రభుత్వంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లోకి ఎలా ప్రవేశించాలి? వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. వీ-హబ్కు సీసీఎంబీ, ఐకేపీ, యశోదా హాస్పిటల్, స్విస్నెక్స్, సక్సీడ్ వంటి సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ ఏడాది జూలైతో ముగిసిన రెండో దశ ఇంక్యుబేషన్ ప్రోగ్రాంలో 24 స్టార్టప్లకు విజయవంతంగా శిక్షణ ముగిసింది.