నవీపేట, జనవరి 22 : తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని, అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల అభివృద్ధి కమిటీ చీఫ్ కన్వీనర్ గంగాధర్ పటేల్ అన్నారు. నాందెడ్ జిల్లాలోని 30 గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు ఆదివారం నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని జన్నేపల్లి గెస్ట్హౌస్లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును కలిసి తమ మద్దతును ప్రకటించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు తమకూ కావాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధి కమిటీ చీఫ్ కన్వీనర్ గంగాధర్ పటేల్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ పోటీ చేస్తే అఖండ మెజారిటీతో గెలిపిస్తామని ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలను మహారాష్ట్రలోనూ అమలు చేయాలన్న ప్రతిపాదనను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతూ దేశ ప్రజల మన్ననలు పొందుతున్నారని అన్నారు. ఈ క్రమంలో పలు రాష్ర్టాల సీఎంలు సైతం బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే మైనంపల్లిని కలిసిన వారిలో నాందెడ్, దెగ్లూర్, బిలోలి, ఇబ్రహీంపేట్, ఖండ్గావ్, ధర్మాబాద్, నయాగావ్, ఎజ్గి తదితర గ్రామాల మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు వెంకట్రావ్, పాండే, నాయకులతోపాటు నవీపేట మండల బీఆర్ఎస్ నాయకులు తెడ్డు పోశెట్టి, దొంత ప్రవీణ్కుమార్, సూరిబాబు, మోహన్ తదితరులు ఉన్నారు.