ధర్మపురి, మార్చి 16: హైదరాబాద్ కోఠిలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్గా జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఆచార్య వారిజారాణి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఆమెకు ప్రభుత్వం నుంచి నియామకపత్రం అందింది. ఇదే యూనివర్సిటీలో ప్రస్తుతం ఆమె తెలుగు శాఖ హెడ్గా కొనసాగుతున్నారు. వారిజారాణి బీఏలో కాకతీయ యూనివర్సిటీ నుంచి 1992లో గోల్డ్ మెడల్ సాధించారు. ఆ తర్వాత ఉస్మానియా నుంచి తెలుగు, సంస్కృత భాషల్లో పీజీ పూర్తి చేశారు.
తెలుగు యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఆ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ పూర్తి చేశారు. అదే యూనివర్సిటీ నుంచి ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య పర్యవేక్షణలో తెలుగు, సంస్కృత కావ్యాలపై పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా పొందారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో ఆమె పాల్గొన్నారు. తెలంగాణలో ఎరుకల భాష, బంజారా లిపిపై పరిశోధనలు కూడా పనిచేశారు. భారత ప్రభుత్వ సమాచార శాఖ ప్రాంతీయ సెన్సార్బోర్డు సభ్యురాలిగా రెండేండ్లపాటు సేవలందించారు.
ధర్మపురికి చెందిన వారిజారాణి తల్లిదండ్రులు పాలెపు గుండయ్య-ఉషారాణి. గుండయ్య ప్రభుత్వ టీచర్గా పనిచేసి విరమణ పొందారు. వారిజారాణి భర్త విష్ణుప్రసాద్ ఐసీఐసీఐ రీజనల్ హెడ్గా పనిచేసి రిటైర్ అయ్యారు. కొడుకు ముకుంద్శాస్త్రి అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు.