సుబేదారి, సెప్టెంబర్ 13: ఘజియాబాద్ దొంగల ముఠాను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు బుధవారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ ఏవీ రంగనాథ్ నిందితుల వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్కు చెందిన అక్బర్ ఖురేషి, కపిల్ జాటోవు, మీరట్కు చెందిన మహ్మద్ షరీఫ్, ఎండీ షహజాద్ ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముఠాలో షరీఫ్, షహజాద్ తండ్రీకొడుకులు. వీరిద్దరు చోరీలకు ఆర్గనైజర్లుగా ఉండి కొంత మందిని ముఠాలో చేర్చుకొని చాలా చోట్ల చోరీలు చేశారు.
ఈ ముఠా ఈ నెల 4న ఢిల్లీ నుంచి ఆదిలాబాద్కు వచ్చి చోరీలకు పాల్పడి అక్కడి నుంచి 5న వరంగల్కు వచ్చింది. అదే రోజున నగరంలోని అపార్ట్మెంట్లలో పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను తస్కరించింది. వద్దిరాజు అపార్ట్మెంట్లో వాచ్మన్ అడ్డగించడంతో దుండగులు పిస్టల్తో బెదిరించారు. ఈ ముఠా కారులో వరంగల్ నుంచి బెంగళూరు వెళ్లి అక్కడ నాలుగు చోరీలకు పాల్పడింది. నిందితులను పట్టుకోవడానికి తెలంగాణ, కర్ణాటక, ఏపీ రాష్ర్టాల హైవే టోల్ప్లాజాల సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా కర్నూల్ టౌన్ ఇన్స్పెక్టర్ శంకరయ్య, సిబ్బంది సాయంతో వేట కొనసాగింది.
నగరంలోని సుబేదారి పోలీసు స్టేషన్ పరిధిలోని తెలంగాణ జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన వెర్నా కారును పోలీసులు తనిఖీ చేస్తే.. అందులో ఉన్న నలుగురు తప్పించుకునే ప్రయత్నం చేశారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. వరంగల్ నగరంలోని అపార్ట్మెంట్లలో చోరీలకు పాల్పడింది ఈ నలుగురి ముఠానే అని నిర్ధారణ అయింది. నిందితుల నుంచి రూ.2 కోట్ల విలువైన 2 కిలోల 380 గ్రాముల బంగారు, వజ్రాల ఆభరణాలు, రూ.5 లక్షల విలువైన 104 కిలోల గంజాయి, పిస్టల్, కారు, రెండు వాకీటాకీలు, నాలుగు నకిలీ ఆధార్కార్డులు, రూ.5 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని సీపీ రంగనాథ్ వివరించారు.