Tenth Exams | వరంగల్ : టెన్త్ హిందీ పేపర్( Hindi paper ) లీకేజీలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ), బీజేపీ కార్యకర్త ప్రశాంత్ కీలకంగా వ్యవహరించారని వరంగల్ సీపీ రంగనాథ్( CP Ranganath ) పేర్కొన్నారు. వీరిద్దరి సోమవారం సాయంత్రం నుంచే వాట్సాప్ చాటింగ్, వాట్సాప్ కాల్స్ తరుచూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాతే హిందీ పేపర్ లీకేజీకి కుట్ర చేశారని సీపీ తెలిపారు.
ఈ కేసులో బండి సంజయ్ను కోర్టులో హాజరుపరిచామని సీపీ పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్టులో బండి సంజయ్ను ఏ1గా, ఏ2గా ప్రశాంత్ను చేర్చినట్లు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. బూర ప్రశాంత్ను నిన్న అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. హిందీ ప్రశ్నపత్రం కమలాపూర్ బాయ్స్ స్కూల్ నుంచి బయటకు వచ్చిందని సీపీ స్పష్టం చేశారు. మొదటగా ఉదయం 11:18 గంటలకు ప్రశాంత్ ప్రశ్నపత్రాన్ని ఫోటో తీసి వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేశారు. 11:24 గంటలకు బండి సంజయ్కు ఫార్వార్డ్ చేశారు. తర్వాత చాలా మందికి ఫార్వార్డ్ అయింది పేపర్. ప్రశాంత్తో పాటు మహేశ్ కూడా చాలా మందికి పంపించారు. ఈటల రాజేందర్, ఆయన ఏపీకు కూడా పంపించారు. వాట్సాప్లో ప్రశ్నపత్రాన్ని ఫార్వార్డ్ చేసిన తర్వాత ప్రశాంత్ 149 మందికి కాల్ చేసినట్లు సీపీ స్పష్టం చేశారు.
ఇక తెలుగు ప్రశ్నపత్రం బయటకు వచ్చిన తరుణంలో.. దీన్ని అవకాశంగా మలుచుని ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఉద్దేశంతో బండి సంజయ్, ప్రశాంత్ కుట్ర చేశారని తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లతో ప్రభుత్వం కుమ్మకై పేపర్లను లీక్ చేస్తుంది. ఐటీ మంత్రి కేటీఆరే ఇందుకు కారణం అని బండి సంజయ్, ప్రశాంత్ మధ్య వాట్సాప్ చాటింగ్స్ నడిచాయి. ఇవే చాటింగ్స్ మరుసటి రోజు ప్రధాన పత్రికల్లో వచ్చాయని తెలిపారు. హిందీ ప్రశ్నపత్రం లీకైన తర్వాత ప్రశాంత్ పంపించిన సందేశాన్నే బండి సంజయ్ ప్రెస్మీట్లో మాట్లాడారు. అవన్నీ తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు.
బండి సంజయ్ను ఫోన్ అడిగితే లేదని చెప్పినట్లు సీపీ పేర్కొన్నారు. బండి సంజయ్ ఫోన్ ఇస్తే తమకు కీలక సమాచారం లభిస్తుందన్నారు. ఈ ఫోన్ను కూడా రికవరీ చేస్తాం. తమ పద్ధతుల్లో ముందుకు వెళ్తాం. దానికి కొంచెం సమయం పడుతుందన్నారు సీపీ.