వనపర్తి టౌన్, మే 29 : ఇంద్రభవనాన్ని తలపించేలా నిర్మించిన వనపర్తి ఎస్పీ కార్యాలయ భవన సముదాయం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. జిల్లా కేంద్రంలో సకల సౌకర్యాలతో నిర్మించగా.. రాజభవనంలా ఆకట్టుకుంటున్నది. 29 ఎకరాల సువిశాల స్థలంలో.. మూడంతస్థుల్ల్లో 60 గదులతో నిర్మించారు. ఎస్పీ, ఏఎస్పీ, ఓఎస్డీలకు ప్రత్యేక గదులతోపాటు రెస్ట్ రూంలు ఏర్పాటు చేశారు. నేరాలను ఛేదించేలా క్రైం విభాగం, పరిపాలనా విభాగాలతోపాటు ఇంటెలిజెన్స్, డాగ్ స్కాడ్, డిజిటల్ ల్యాబ్లు, ట్రైనింగ్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్, ఐటీ కోర్, ఫింగర్ ప్రింట్స్, సైబర్ ల్యాబ్, పీడీ సెల్, మీటింగ్లు నిర్వహించేలా నాలుగు హాళ్లు, ఇన్వార్డు, ఔట్వార్డు, మినీ కాన్ఫరెన్స్హాల్, పరేడ్ గ్రౌండ్, ఆహ్లాదకర వాతావవరణం కోసం పార్కు ఏర్పాటు చేశారు. మంగళవారం ఈ కార్యాలయాన్ని హోంమంత్రి మహమూద్ అలీ, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, డీజీపీ అంజనీకుమార్ ప్రారంభించనున్నారు.