వనపర్తి : ప్రణాళికాబద్ధంగా వనపర్తిని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి పీర్లగుట్ట డబుల్ బెడ్రూం ఇండ్లకు వెళ్లే సీసీ రహదారి నిర్మాణ పనులు, రాజాపేట సమీపంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు పరిశీలించి, శ్రీరంగాపురం మండలం నాగసానిపల్లి చింతలకుంట ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే రహదారిలో నూతనంగా నిర్మించిన వంతెనను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో రాజీలేదన్నారు. చేసిన పనులు పదికాలాల పాటు నిలువాలన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని, పేదల ఆత్మగౌరవానికి ప్రతీక డబల్ బెడ్రూం ఇండ్లు అన్నారు. అర్హులయిన పేదలందరికీ దశలవారీగా ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. రహదారి విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు.
రహదారి విస్తరణ పనులు పూర్తయితే వనపర్తి కొత్త శోభను సంతరించుకుంటుందన్నారు. రెండేళ్లలో చేపట్టిన అభివృద్ది పనులన్నీ పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. తాళ్ల చెరువు, అమ్మచెరువు ఆధునికీకరణ, నల్లచెరువు మినీ ట్యాంక్ బండ్, వనపర్తి మార్కెట్ స్థానంలో సమీకృత మార్కెట్ నిర్మాణం, పెబ్బేరు రహదారిలో వే సైడ్ మార్కెట్ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. మెడికల్ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటు వనపర్తి జిల్లా కేంద్రం స్వరూపం మారిపోతుందన్నారు.