హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల స్థానానికి ఓటు హక్కు నమోదు చేసుకొనేందుకు పట్టభద్రులు ఆసక్తి చూపడం లేదు. ఓటరు నమోదుకు మంగళవారంతో గడువు ముగుస్తుండగా ఇప్పటివరకు 3.30 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. గత గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో నమోదు చేసుకున్న దాదాపు 5.50 లక్షల మందితో పోల్చితే ఇది తక్కువ. ఈ సారి ఇంకా ఎక్కువ సంఖ్యలో గ్రాడ్యుయేట్లు పెరగాల్సి ఉండగా, ఆ స్థాయిలో ఓట్లు నమోదు అయ్యే సూచనలు కనబడటంలేదని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఓటు హక్కు కోరుకునేవారితోపాటు ఇప్పటికే ఓటర్లుగా ఉన్న గ్రాడ్యుయేట్స్ సైతం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం నిబంధన విధించడం సమస్యాత్మకంగా మారింది.
పదే పదే ఓటు నమోదుపై గ్రాడ్యుయేట్స్ విసుగు చెందుతున్నారు. ఓటుహక్కు ఉన్నవారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలనే నిబంధనపై అసహనం వ్యక్తంచేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఓటుహక్కు పొందినవారిని కొనసాగిస్తూ కొత్త వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తే సరిపోయేది కదా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ నిబంధనను కేంద్ర ఎన్నికల సంఘం సవరించాలని సూచిస్తున్నారు. నల్లగొండ- ఖమ్మం – వరంగల్ గ్రాడ్యుయేట్ స్థానం ఉప ఎన్నికల్లో ఓటర్లు దరఖాస్తు చేసుకొనేందుకు మంగళవారం గడువు ముగియనున్నది. అర్హులైన వారు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 24న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. దీనిపై అభ్యంతరాలను మార్చి 14 లోపు తెలపాల్సి ఉంటుంది. తుది ఓటరు జాబితాను ఏప్రిల్ 4న ప్రకటిస్తారు.