హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నదని సీఈవో వికాస్రాజ్ తెలిపారు. ఎన్నికల బందోబస్తు కోసం 60 వేల మంది పోలీసులతోపాటు 145 కంపెనీల కేంద్ర బలగాలు వస్తున్నాయని తెలిపారు. ఇంటినుంచే ఓటు వేయాలనుకునేవారి నుంచి దరఖాస్తుల స్వీకరణ సోమవారం నుంచే ప్రారంభమైందని, అర్హులైనవారు ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
సోమవారం ఆయన బీఆర్కేఆర్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. హోం ఓంటింగ్ కోసం ఫారం డీ అందజేయాలని, ఈ దరఖాస్తులు గ్రామ కార్యదర్శి లేదా బీఎల్వో వద్ద అందుబాటులో ఉంచామని చెప్పారు. 85 ఏండ్ల వయసు పైబడినవారితోపాటు దివ్యాంగ ఓటర్లకు ఇంటినుంచే ఓటు వేసే సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 85 ఏండ్లు పైబడినవారు 1.94 లక్షల మంది, దివ్యాంగ ఓటర్లు 5.26 లక్షల మంది ఉన్నారని వివరించారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన నాలుగు రోజుల తరువాత హోం ఓటింగ్ ప్రారంభమవుతుందని, పోలింగ్ సిబ్బంది వచ్చి ఇంటి వద్దనే ఓటింగ్ సౌకర్యం కల్పిస్తారని చెప్పారు. ఏప్రిల్ 15 వరకు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని చెప్పారు.
ఈ నెల 1 నుంచి ఇప్పటివరకు రూ.21.63 కోట్ల నగదు, వివిధ రకాల వస్తువులను తనిఖీల్లో సీజ్ చేశామని వికాస్రాజ్ వివరించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఇప్పటివరకు రూ.243 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను సీజ్ చేశామని తెలిపారు. అత్యవసర సర్వీసులు అందించే ఉద్యోగులకు పోస్టల్ ఓటు సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు.
ఎన్నికల నిర్వహణపై ఉన్నతాధికారులకు అందరికీ ఢిల్లీలో, రాష్ట్రస్థాయి అధికారులకు హైదరాబాద్లో, ఇతర అధికారులకు జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసినట్టు వికాస్రాజ్ తెలిపారు. 1.80 లక్షల మంది పోలింగ్ సిబ్బంది, మరో 25 వేల మంది ఇతర విధుల్లో పాల్గొంటారని వివరించారు.
కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఏర్పాట్లు చేస్తున్నామని, రిటర్నింగ్ అధికారిగా కంటోన్మెంట్ బోర్డు సీఈవో వ్యవహరిస్తారని వికాస్రాజ్ తెలిపారు. మే 13న జరిగే ఉపఎన్నికకు 500 వరకు బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఇక్కడ 2.51 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, 232 పోలింగ్ కే్ంరదాలు ఉన్నాయని వివరించారు.
ప్రజలు రూ.50 వేల కంటే ఎక్కువ నగదుతో బయటికొస్తే వాటికి సంబంధించిన ఆధారాలు, పత్రాలు వెంట తీసుకోని రావాలని వికాస్రాజ్ సూచించారు. రాజకీయ పార్టీలు ఏ రకమైన మీడియాలో ప్రకటనలు ఇచ్చినా వాటికి సంబంధించి ఎంసీఎంసీ ఆమోదం తీసుకోవాలని స్పష్టంచేశారు. ఈ-పేపర్లుకు ఇచ్చే ప్రకటనలకు కూడా అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టంచేశారు. ఎన్నికల్లో అక్రమాలపై సీ విజిల్ యాప్ ద్వారా, లేదా 1950 నెంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. రాజకీయ పార్టీలు సువిధ యాప్ ద్వారా అనుమతులకు దరఖాస్తు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో 9 వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని చెప్పారు.
రాజకీయ పార్టీలు ర్యాలీలు, రోడ్షోలు అన్నింటికీ అనుమతి తీసుకోవాల్సిందేనని వికాస్రాజ్ స్పష్టం చేశారు. స్కూల్ పిల్లలను రోడ్షోలో పాల్గొనకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో అడిషనల్ సీఈవో లోకేశ్కుమార్, జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్, డిప్యూటీ సీఈవో సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో 13 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు, మరో ఐదు నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మహబూబ్నగర్, నాగర్కర్నూలు, నల్లగొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్నది. మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల నియోజకవర్గాల్లో మాత్రం పురుష ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్నది.