పెద్దఅంబర్పేట, జనవరి 19: విస్టెక్స్ వ్యవస్థాపకుడు, సీఈవో సంజయ్షా దుర్మరణం చెందారు. సంస్థ ఉద్యోగులతో కలిసి కంపెనీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించుకుందామని హైదరాబాద్ వచ్చిన ఆయన సంబురాలు చేసుకుంటుండగానే మృతిచెందారు. ఈ ఘటన నగర శివారు అబ్దుల్లాపూర్మెట్లో శుక్రవారం చోటుచేసుకొన్నది. ఈ ప్రమాదంలో సంస్థ ప్రెసిడెంట్ విశ్వనాథ్రాజ్ కూడా తీవ్ర గాయాలపాలై మృత్యువుతో పోరాడుతున్నారు. ముంబైకి చెందిన సంజయ్షా 25 ఏండ్ల కిందట విస్టెక్స్ ఏషియా కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ అంచెలంచెలుగా దేశవిదేశాలకు విస్తరించింది. ఈ సందర్భంగా సిల్వర్ జూ బ్లీ వేడుకలు నిర్వహించేందుకు అబ్దుల్లాపూర్మెట్లో ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు కంపెనీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న దాదాపు 700 మంది హాజరయ్యారు.
అయితే వేడుకల ప్రారంభం సందర్భంగా గురువారం రాత్రి 7 గంటల సమయంలో సంజయ్షా ఎంట్రీ కోసం ఏరియల్ యాక్ట్ సిద్ధం చేశారు. 20 ఫీట్ల ఎత్తు నుంచి క్రేన్ లాంటి(రోప్ వే) యంత్రం నుంచి సంజయ్ షా, విశ్వనాథ్రాజ్ కిందకి దిగుతుండగా, క్రేన్ ఇనుప తీగలు తెగిపోయాయి. దీంతో కిందపడి, సిమెంట్ దిమ్మెలకు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన హయత్నగర్లోని మ్యాక్స్క్యూర్ హాస్పిటల్, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మలక్పేటలోని యశోద దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి తర్వాత సంజయ్షా మృతి చెందారు. విశ్వనాథ్ రాజ్ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారని, ఆయన పరిస్థితి విషమంగా ఉన్న ట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈవెంట్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. సంబురాలు చేసుకొందామని అమెరికా నుంచి వచ్చిన సీఈవో ప్రమాదంలో మృతిచెందటంపై ఉద్యోగులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
మాతృదేశంలో సంబురాలు చేసుకొందామని
సంజయ్ షా స్థాపించిన విస్టెక్స్ సంస్థలో దా దాపు 1,600 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తు తం ఆయన చికాగోలో స్థిరపడ్డారు. ఉద్యోగులను కలుసుకోవటం చాలా అరుదు. ఉన్నతాధికారులే సంస్థను నిర్వహిస్తుంటారు. సిల్వర్ జూబ్లీ వేడుకలను మాతృదేశం భారత్లో చేసుకోవాలని తలచి న ఆయన.. ప్రత్యేకంగా హైదరాబాద్ను ఎంచుకొన్నారు. విదేశాల్లోని ఉన్నతోద్యోగులను ఈ ఈవెంట్కు ఆహ్వానించారు. సంజయ్ షా తన వ్యక్తిగత విమానంలో నేరుగా చికాగో నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చారు. ఉద్యోగులతో ఘనంగా సంబురాలు చేసుకొందామని ఆశించగా, ఈవెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యం శాపంగా మారింది.