హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ)/హిమాయత్నగర్: బీజేపీ విభజన రాజకీయాలు దేశంలో మతహింసను పెంచి పోషిస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. దాంతో లౌకికతత్వం ప్రమాదంలోకి నెట్టివేయబడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మఖ్దూంభవన్లో సీపీఐ రాష్ట్ర 3వ మహాసభల ఆహ్వాన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైవిధ్యభరిత, సుసంపన్న సంస్కృతి, సంప్రదాయాలు కలిగిన మన దేశాన్ని అఖండ హిందూదేశంగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ధ్వజమెత్తారు. అందుకు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను ధ్వంసం చేసేందుకు కుట్రలు పన్నుతున్నదని మండిపడ్డారు. ప్రశ్నించేవారిపై దేశద్రోహం లేదా ఈడీ, సీబీఐతో కేసులు పెట్టిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రధాని మోదీ పాలనపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 4 నుంచి 7 వరకు శంషాబాద్లో నిర్వహించే పార్టీ మహాసభలను చరిత్ర పుటల్లో నిలిచేలా విజయవంతం చేయాలని నారాయణ కోరారు.