Vinod Kumar | కేబినెట్లో చర్చించి రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడాన్ని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తప్పుపట్టారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ను తొలిగించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో టీఎస్టీఎస్సీ మాజీ చైర్మన్ చిరుమల్ల రాజేశ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ రాచరిక చిహ్నాలని సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కాకతీయులు 11, 12వ దశాబ్దాల్లో యావత్ దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారని, కాకతీయులు రాచరిక వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్లు కాదని, పేదల కోసం పని చేసిన వారన్నారు.
కాకతీయుల కాలంలో తెలంగాణలో గొలుసుకట్టు చెరువులతో పాటు రామప్ప, పాకాల, లక్నవరం, ఘనపూర్, సింగసముద్రం, నల్లగొండ జిల్లాలో పానగల్ ఉదయసముద్రం రిజర్వాయర్తో పాటు వేలాది చెరువులు, కుంటలను నిర్మించారని గుర్తు చేశారు. వాటి ఫలితంగానే నేడు తెలంగాణలో వ్యవసాయం కొనసాగుతున్నదన్నారు. తెలంగాణ వచ్చాక పదేండ్లలో కేసీఆర్ చెరువులు, కుంటలను మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి చేశారని పేరొన్నారు. కాకతీయులు అనగారిన బీసీ కులానికి చెందిన వారుగా చరిత్రకారులు చెబుతుంటారన్నారు. 800ఏండ్ల కాకతీయుల చరిత్రకు నిదర్శమైన కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తామమంటూ సీఎం ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సారనాథ్ స్థూపంపై ఉన్న మూడు సింహాలు, అశోక చక్రం చిహ్నాలను భారత దేశ చిహ్నంలో తీసుకున్నారని.. మరి అవి రాచరిక వ్యవస్థకు సంకేతం కాదా? అంటూ నిలదీశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వ్యవసాయాన్ని, తెలంగాణ భాషను, యాసను, తెలంగాణ చరిత్రను తుడిచివేయాలని ఆంధ్రాపాలకులు అనుకున్నారన్నారు. ఇప్పుడు సీఎం తీరును చూస్తుంటే తెలంగాణ చరిత్రను కనుమరుగు చేయాలని భావిస్తున్నట్టున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఆయన ఇంకా తెలుగుదేశం నుంచి వచ్చిన లక్షణాలు పోయినట్లు అనిపించడం లేదన్నారు. సీఎం హుందాగా ఉండాలి కానీ.. ఎవరో చెప్పిన వాటిని నమ్మి ఇలా ప్రవర్తించడం ఏమిటన్నారు.
తమిళనాడు, త్రిపుర వంటి రాష్ట్రాల్లో టీజీ అనే పేరు ఉండడం వల్లే తెలంగాణ స్టేట్ (టీఎస్)గా గత ప్రభుత్వం మార్చిందన్నారు. కాకతీయులు పాలించిన ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కొండా సురేఖ, సీతక్క మంత్రులుగా ఉన్నారని.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వారు స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెనకి తగ్గకుంటే ప్రజలను, యువతను ఏకంచేసి ఉద్యమిస్తామన్నారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తుల గురించి కేబినెట్లో చర్చకు వస్తే మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటిశ్రీనివాస్ రెడ్డి, తుమ్మలనాగేశ్వర్ రావు, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరస్కరించాలని కోరారు.