గల్ఫ్లో ఉన్న మనోళ్లంతా ఇంటికి తిరిగి రావాలె. ఇకడ ఎన్నో అవకాశాలున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో నిర్మాణరంగం వేగంగా పెరుగుతున్నది. ఇతర రాష్ట్రాలకు చెందినవారు పనులు చేస్తున్నారు. గల్ఫ్లో ఉన్న మనోళ్లంతా వస్తే ఇకడే మస్తు పని దొరుకుతది
-గల్ఫ్ కార్మికులకు గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు
ఇది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం సర్వారెడ్డిపల్లికి చెందిన ఇరుగురాల రవి కథ!
వ్యవసాయం అంటే మక్కువ..! అందుకే పొలం లేకపోయినా కౌలుకు చేశాడు! చెరువు నిండితేనే పొలం పండేది! లేదంటే తగిన వర్షాలైనా పడాల్సిందే! కానీ.. ప్రతిసారీ అశాభంగమే! పంట సగంలో ఎండిపోవుడే! పెట్టుబడి రాక.. ఎదురు అప్పులు పెరిగి.. కూలి పనులకూ వెళ్లేవాడు! అప్పులు తీరేదారిలేక 2016లో అబూధాబీకి వెళ్లి కూలి పనులు చేసుకున్నాడు! తెలంగాణ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి వరద కాలువను సజీవధారగా మార్చడంతో గల్ఫ్ జీవితానికి స్వస్తి పలికి 2019లో ఇంటికి తిరిగి వచ్చాడు. ఎటు చూసినా నీళ్లే! భూగర్భం నిండా జలాలే! రవికి ఆశలు చిగురించాయి. అదే రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయాన్ని ప్రారంభించాడు. ఖర్చులు పోను ఏడాదికి లక్షన్నరదాకా సంపాదిస్తున్నాడు. సీఎం కేసీఆర్ దయతో తమ గ్రామంలాంటి ఎన్నో గ్రామాల రైతుల జీవితాలు బాగుపడ్డాయని హర్షం వ్యక్తం చేస్తున్నాడు.
వలస జీవితం ఎంత కఠినమైనదో, ఆ బతుకు ఎంత దుర్భరమైనదో లాక్డౌన్ కాలం కండ్లకు కట్టింది. అంతకుమించిన కష్టాలను, కన్నీళ్లను దిగమింగిన చరిత్ర తెలంగాణది. పిడికెడు మెతుకుల కోసం అన్నమో రామచంద్రా..! అంటూ వలసపోతున్నవారిని చూసి తల్లడిల్లిన గుండెలు మనవి.
నీళ్లు లేక, మేతలేక పశువులను అయినకాడికి సంతల్లో అమ్ముకున్న దీనత్వం. చిన్న పిల్లలను, వృద్ధులను ఇండ్ల వద్ద వదిలేసి, ఊళ్లకు ఊళ్లే వలసపోయిన దుర్బలత్వం. ఆ చేదు జ్ఞాపకాలు గుర్తుకొస్తే దుఃఖం తన్నుకొస్తుంది.
ఈ ఫొటోలో కనిపిస్తున్నది చిటుకుల వెంకట్రెడ్డి. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్. ఏడున్నర ఎకరాల భూమి ఉన్నది. ‘మక్క వేస్తే.. నీళ్లు లేక మొత్తం ఎండిపోయింది. అప్పాయె, మన్నాయె, మషాడమాయె ఎట్ల భగవంతా’ అని ఆలోచించిండు! ఎవుసమే వద్దనుకున్నడు!
‘ఏ ధీము లేక రెండేండ్లు కువైట్ పోయిన. అక్కడ కూలీ లెక్క పనిచేసిన.. అటో ఇటో కాలం వెల్లదీసి మళ్లీ ఇటొచ్చిన. సీఎం కేసీఆర్ ఇక్కడ రంగనాయకసాగర్ రిజర్వాయర్ కట్టిండు. మా ఊరు రిజర్వాయర్ను ఆనుకొనే ఉంటది. ఫుల్లుగా నీళ్లొచ్చినయ్. ఎకరం మిర్చి, రెండున్నర ఎకరాల వరి, బెండకాయ.. రకరకాల పంటలు పెట్టిన. లాభం మంచిగున్నది. అప్పటికీ ఇప్పటికీ చానా తేడా ఉన్నది. ఇప్పుడు కుటుంబంతో కలిసి రంది లేకుండా రాజు లెక్క పనిచేస్కుంటున్న’ అంటూ సంతోషం వెలిబుచ్చాడు!
వెంకట్రెడ్డేకాదు.. ఒకప్పుడు పొట్టచేతబట్టుకొని దేశం పోయిన అనేకమంది ఇప్పుడు సొంతూరుకు వచ్చి గౌరవంగా బతుకుతున్నారు.
2008కి ముందు ఇక్కడ పనిలేకుండే. 2009లో సౌదీ వెళ్లా. 2017లో వచ్చిన. ఎవుసానికి ప్రాధాన్యం పెరగటంతో మళ్లీ పోవాలనిపించలేదు. ఏటా ఖర్చులు పోగా రూ.2 లక్షల నుంచి 3 లక్షలు మిగులుతున్నాయి. మళ్లీ గల్ఫ్ పోవాలన్న ఆలోచన రాలేదు. ఇగ పోను.
– ఎగ్గం విఠల్, రైతు, పార్డి(కే), కుభీర్ మండలం, నిర్మల్ జిల్లా
పన్నెండేండ్ల కిందట ఈ పరిస్థితి ఉంటే నేను సౌదీకి వెళ్లి అక్కడ కూలీ పని చేసుకొనేటోన్నే కాదు. ఇక్కడే నాకున్న భూమిలో రాజులా బతికేవాడిని.
-నేనావత్ లక్ష్మణ్, చిట్యాల తండా, వనపర్తి
2020లో ఇంటికి వచ్చేసిన. ఎవుసం చేసుకుంటున్న. పద్దెనిమిదేండ్ల వనవాసం ముగిసినట్టు అన్పిస్తుంది. రెండేండ్ల నుంచి రాజ్యం పాలిస్తున్నానని చెప్పను గనీ, రంది లేకుండా బతుకుతున్న.
.
– బాసనపల్లి శ్రీనివాస్. రాజేశ్వర్రావుపేట, ఇబ్రహీంపట్నం మండలం, జగిత్యాల జిల్లా
ఆ దుర్భర పరిస్థితులే తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ, ఊపిరి. ఇప్పుడు ఆ బాధలు లేవు. ఆ కష్టాలు లేవు. తెలంగాణ గడ్డపై కొత్త ఆశలు చిగురించాయి. శ్రమజీవుల జీవితాల్లో సరికొత్త ఉషస్సులు నిండాయి. పుష్కలంగా నీళ్లొచ్చాయి. రైతుబంధు వచ్చింది. ఎరువులు, విత్తనాలు, కరెంట్.. దేనికీ కొరత లేని తెలంగాణ ఆవిష్కృతమైంది. నాడు వలసపోయిన పల్లెలు ఇప్పుడు పాడి పంటలతో కళకళలాడుతున్నాయి. ఎక్కడో సుదూరాన ఉన్న గల్ఫ్, దుబాయ్, ముంబై లాంటి ప్రాంతాలకు వలసవెళ్లినవారు తిరిగొస్తున్న దృశ్యం ప్రతి పల్లెలోనూ సాక్షాత్కారమవుతున్నది. ఇది.. ఏడున్నరేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి. ఇది.. పేదల జీవితాలను, వలస జీవుల కష్టాలను, రైతన్నల అగచాట్లను స్వయంగా చూసి, చలించిన నాటి ఉద్యమ నేత, నేటి సీఎం కేసీఆర్ కఠోర తపస్సుకు లభించిన ఫలం.. ఫలితం.
తిరిగి రావాలె. ఇకడ ఎన్నో అవకాశాలున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నిర్మాణరంగం వేగంగా నడుస్తున్నది. ఇతర రాష్ట్రాలకు చెందినవారు వచ్చి పనులు చేస్తున్నారు. గల్ఫ్లో ఉన్న మనోళ్లంతా వస్తే ఇకడే మస్తు పని దొరుకుతుంది’.. గల్ఫ్లోని మన కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు ఇది. ఒకప్పుడు వలసలను ప్రోత్సహించిన ప్రభుత్వాలే తప్ప.. వాపస్ రావాలని కోరిన ముఖ్యమంత్రి మాత్రం సీఎం కేసీఆరే. ఈ పిలుపు ఆషామాషీగా ఇచ్చింది కాదు.. వలసలకు కారణాలను లోతుగా విశ్లేషించి పరిష్కరించారు. సొంతూళ్లో, సొంత రాష్ట్రంలో చేతినిండా పని దొరుకుతుందని, కడుపునిండా తినగలుగుతామని భరోసా కల్పించారు. వాటి ఫలితమే ఇప్పుడు విదేశాల నుంచి వలసలు వాపస్..
ఉపాధికోసం సొంతూరును వదిలి వలస వెళ్లడం ఎవరికైనా కష్టమే. సమీపంలోని పట్టణానికైతే కాస్త ఫర్వాలేదు.. కానీ కుటుంబాన్ని వదిలి విదేశాలకు వెళ్లడం, ఏండ్లకేండ్లు అక్కడే గడపాల్సి రావడం అత్యంత వేదనాభరితం. భార్యాబిడ్డలను, తల్లిదండ్రులపై మనసు గుంజుతున్నా వెళ్లలేక, రెండు మూడేండ్లకు ఒకసారి వచ్చి, ఒకటి రెండు నెలలు గడిపి, ఆ జ్ఞాపకాలతోనే గడుపుతున్నవారు గల్ఫ్లోనే 12 లక్షల మంది ఉన్నట్టు అంచనా. సొంతూళ్లో చిన్నపని దొరికినా చాలు ఇక్కడేఉండి పోదామనుకొనేవారు ఎందరో.
వలసలు విదేశాల నుంచి తెలంగాణకు వాపస్ అవుతున్నాయి. ఒకప్పుడు కూలిపని దొరుకని పల్లెలు.. ఏడున్నరేండ్లలోనే ఉపాధి కేంద్రాలుగా మారాయి. ఒకప్పుడు బీడుభూములతో బోసిపోయిన పల్లెలు.. ఇప్పుడు పచ్చని పొలాలతో కళకళలాడుతున్నాయి. రూ.లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వెలుస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలకు రాష్ట్రం గమ్యస్థానమైంది. నిర్మాణరంగం ఎన్నడూ చూడనంత వేగంగా వృద్ధి చెందింది. స్థానికంగా లక్షల మందికి ఉపాధి దొరుకుతున్నది. ఈ పరిణామాల ఫలితంగా విదేశాల నుంచి వలసలు వాపస్ వస్తున్నాయి.
(కాసాని మహేందర్రెడ్డి) నమస్తే తెలంగాణ నెట్వర్క్
ఇవాళ తెలంగాణలో వ్యవసాయం పల్లెకు జీవనాడిగా మారింది. కాలం సాగక రైతులు వెక్కి వెక్కి ఏడ్చినచోటే.. రైతులు ఇప్పుడు సిరులు పండిస్తున్నారు. సమస్యను మూలం నుంచి అర్థంచేసుకున్న సీఎం కేసీఆర్.. అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా పరిష్కారం చూపారు. దీంతో పల్లెల్లో వ్యవసాయం పెరిగింది. చేతినిండా పనిదొరికింది. ప్రస్తుతం రాష్ట్రంలో సగం జనాభాకు వ్యవసాయ రంగం ఉపాధి కల్పిస్తున్నది. ఉపాధి దొరుకక గల్ఫ్కు వలస వెళ్లిన కార్మికులకు ఈ పరిణామాలు కొండంత భరోసా ఇచ్చాయి. దీంతో సొంతూరుకు తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు.
కడుపునిండా నీళ్లు: సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయం మూడున్నరేండ్లలో పూర్తి చేయడంతోపాటు పలు సాగునీటి ప్రాజెక్టులను నిర్మించారు. ఫలితంగా దిగువన పారుతున్న గోదావరి 550 మీటర్లు ఎగిసి గట్టుమీద ఉన్న కొండ పోచమ్మసాగర్ వరకు చేరింది. 10 వేలకుపైగా చెరువులు, వేల వాగులు, వంకలకు ప్రాణం పోసింది. వడివడిగా పొలాల వరకు చేరింది. ఒకప్పుడు వందల అడుగులు తవ్వినా నీళ్లు పడని పరిస్థితి నుంచి.. ఇప్పుడు భూమాత కడుపు నిండా 125 టీఎంసీల నీళ్లున్న పరిస్థితికి తెలంగాణ చేరుకున్నది. దీంతో ఒకప్పుడు ఆరుతడి పంటలు వేసేందుకే పదిసార్లు ఆలోచించిన రైతు.. ఇప్పుడు వరి రెండు పంటలు వేస్తున్నాడు.
నిరంతరాయంగా కరెంటు: ఒకప్పుడు సాగుకు రెండుమూడు గంటల కరెంటే దిక్కు. పంటలు ఎండి రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడటం చూశాం. రైతుకు కావాల్సినంత కరెంటు ఇస్తే బంగారం పండిస్తారని గ్రహించిన సీఎం కేసీఆర్ 24 గంటలపాటు నిరంతరాయంగా ఉచితంగా విద్యుత్తు అందించేలా చర్యలు తీసుకొన్నారు. దీంతో ఇప్పటివరకు వ్యవసాయం దండగ అనుకొన్నవారంతా.. వ్యవసాయం పండగ అనేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. పొట్ట చేత పట్టుకుని గల్ఫ్లో కూలీలుగా వెళ్లిన తెలంగాణ బిడ్డలు ఇప్పుడు గుండెలనిండా ధైర్యంతో ఇక్కడికి వచ్చి వ్యవసాయాన్ని చేపట్టి దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు.
రైతుకు సంక్షేమ భరోసా: నీళ్లు, కరెంటుతోపాటు ఏండ్లకేండ్లు నష్టాలతో ధైర్యం కోల్పోయిన రైతుకు భరోసా ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ రైతుబంధు రూపంలో పెట్టుబడి సాయం అందించారు. ఇటీవలే రూ.50 వేల కోట్ల మార్క్ను దాటిన సంగతి తెలిసిందే. రైతుబీమా, నాణ్యమైన విత్తనాలు, అధికారులను నియమించి పర్యవేక్షణ పెంచడం వంటి చర్యల ఫలితంగా రైతుల్లో భరోసా వచ్చింది. మరోవైపు పల్లెల్లో కులవృత్తులకు జీవం వచ్చింది. గొర్రెల పంపిణీ, ఉచితంగా చేపపిల్లల పంపిణీ, వివిధ వర్గాలకు సామగ్రి అందజేత వంటి చర్యల ఫలితంగా కులవృత్తులు బాగుపడ్డాయి. పల్లెలు ఉపాధి కేంద్రాలుగా మారాయి.
ఏడేండ్లలో రాష్ర్టానికి సుమారు 12వేల పరిశ్రమలు కొత్తగా వచ్చాయి. ఈ పెట్టుబడుల విలువ సుమారు రూ.2 లక్షల కోట్లు. ఇందులో సుమారు 9 వేల పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి. 13 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించింది. రియల్ఎస్టేట్ రంగం, నిర్మాణ రంగాలు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. కార్మికుల కొరత కారణంగా ఇతర రాష్ర్టాల నుంచి పిలిపించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఉత్పత్తి, నిర్మాణ రంగాలు ఉండే ద్వితీయ రంగం 2014-15 నుంచి 2020-21 నాటికి 72% వృద్ధి నమోదుచేసింది.
ఐటీ రంగం ఏడేండ్లలో 120% వృద్ధిని నమోదుచేసింది. 2014లో కేవలం రూ.57 వేల కోట్ల ఐటీ ఎగుమతులు జరిగితే, ఏడేండ్ల తర్వాత 2020-21 నాటికి అది రూ.1.45,626 కోట్లకు చేరింది. రాష్ట్రం ఏర్పడిన నాడు తెలంగాణ ఐటీ రంగంలో 3.23లక్షల మంది ప్రత్యక్ష కొలువులు ఉంటే. ఆ సంఖ్య 6.28 లక్షలకు చేరింది. ఒక ప్రత్యక్ష ఉపాధి దాదాపు రెండున్నర రెట్లు పరోక్ష ఉద్యోగ కల్పనకు కారణమవుతుంది. ఆ ప్రకారంగా 20 లక్షల పై చిలుకు మందికి ఐటీ రంగం ఉపాధి కల్పిస్తున్నది. ఏడేండ్లలో అమెజాన్, యాపిల్, మైక్రోసాప్ట్, గూగుల్, ఫేస్బుక్ వంటి అనేక దిగ్గజ సంస్థలు హైదరాబాద్కు విస్తరించాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో స్థానం పొందిన 20కి పైగా కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. 50 కంటే ఎక్కువ టాప్ ఎంఎన్సీలు హైదరాబాద్లో కార్యాలయాలు ప్రారంభించాయి. దీంతో విదేశాలకు వెళ్లిన ఐటీ ప్రొఫెషనల్స్ సైతం హైదరాబాద్కు తిరిగి వస్తున్నారు. ఆతిథ్య, పర్యాటక రంగాల్లో సైతం అనూహ్య వృద్ధి నమోదైంది. రెస్టారెంట్లు, హోటళ్లు, ప్రొఫెషనల్ సర్వీసులు ఏడేండ్లలో రెట్టింపయ్యాయి. జీఎస్డీపీలో వీటి వాటా రూ. 64 వేల కోట్ల నుంచి రూ.1.36 లక్షల కోట్లకు పెరుగటమే ఇందుకు నిదర్శనం.
దేశంలోనే అత్యధికంగా కేరళ నుంచి గల్ఫ్కు వలస వెళ్తుంటారు. ప్రస్తుతం దాదాపు 35 లక్షల మందికి పైనే మలయాళీలు గల్ఫ్ దేశాల్లో ఉంటున్నట్టు అంచనా. అందుకే.. కేరళలో ప్రత్యేకంగా గల్ఫ్ పాలసీ కూడా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కేరళలో వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్నది. రైతుల సంక్షేమం గురించి ఆలోచించే, రైతు కూలీల గురించి నినదించే కమ్యూనిస్టులు సైతం కేరళలో కూడా వ్యవసాయ అనుకూల వాతావరణం సృష్టించలేకపోయారు. కార్మికుల సంక్షేమం గురించి నిత్యం ఆలోచించే వ్యక్తులే అధికారంలో ఉన్నా గల్ఫ్ నుంచి వలసలను వాపస్ తెప్పించలేకపోయారు. అదే సమయంలో గల్ఫ్ నుంచి సొంతూళ్లకు వలసలు వాపస్ రావడం ఒక్క తెలంగాణకే సాధ్యమైంది. ఇందుకు ప్రధాన కారణం వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందడం. రాష్ట్రంలో వ్యవసాయ రంగం సగటున 20 శాతం వృద్ధిని సాధిస్తూ దూసుకుపోతున్నది. రాష్ట్రంలో సగం జనాభాకు ఉపాధి కల్పిస్తున్నది. ఇతర రాష్ర్టాల నుంచి వ్యవసాయ కూలీలను పిలిపించుకోవాల్సిన పరిస్థితి. ఈ వాతావరణం గల్ఫ్ నుంచి వచ్చేవారికి భరోసా కల్పిస్తున్నది. అదే సమయంలో కేరళలో మాత్రం వ్యవసాయ రంగం వృద్ధి రేటు కేవలం 8 శాతం. కరోనా విపత్తు సమయంలో గల్ఫ్ నుంచి వేలాది మంది కేరళకు తిరిగి వచ్చారు. వారికి ఎలా ఉపాధి కల్పించాలో తెలియక కేరళ అధికారులు తలలు పట్టుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ముందస్తుగా ఏర్పాట్లు చేసింది. వ్యవసాయం, భవన నిర్మాణం, పారిశ్రామిక రంగాల్లో ఉపాధి కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా న్యాక్ ద్వారా శిక్షణ ఇప్పించింది.
స్వగ్రామంలో వ్యవసాయం న్యూజిలాండ్లో ఎంబీఏ చదివి, అక్కడే ఉద్యోగం చేసిన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్కు చెందిన బసంత్పూర్ రమేశ్రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని గుర్తించి స్వగ్రామానికి చేరారు. డిమాండ్ ఉన్న డ్రాగన్ ఫ్రూట్ను సాగు చేసి, ఎకరాకు రూ.4 లక్షల ఆదాయాన్ని పొందుతున్నారు. 24 గంటల కరెంట్, సబ్సిడీపై బిందు సేద్యం పరికరాలు, మార్కెటింగ్కు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నదని, సాగు నీటికి కొదవలేకుండా చేసిందని చెప్పారాయన. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతోనే న్యూజిలాండ్లో ఉద్యోగాన్ని మానేసి ఇక్కడికి వచ్చినట్టు వెల్లడించారు. అంతేకాదు.. డ్రాగన్ ఫ్రూట్తో వైన్ తయారీకి కూడా సిద్ధమయ్యారు. ‘డ్రాగన్ ప్రూట్తో వైన్ తయారు చేసేందుకు ప్రభుత్వ అనుమతికి దరఖాస్తు చేసుకొన్నా. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే వైన్ ఉత్పత్తి చేసేందుకు కంపెనీ ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే డ్రాగన్ ప్రూట్తో వైన్ తయారు చేసేందుకు చేసిన పరిశోధన విజయవంతమైంది’ అని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ రైతు సంక్షేమ పథకాలతోనే నేను వ్యవసాయం చేస్తున్నా. అమెరికాలో ఉద్యోగం చేస్తూ నెలకు రూ.3 లక్షలు పొందే అవకాశం ఉన్నా ప్రశాంతమైన జీవన విధానం కావాలని పుట్టిన ఊరిలో వ్యవసాయాన్ని ప్రారంభించా. బోడకాకర గింజలను ప్రతి రెండేండ్లకోసారి కొని పంటచేనులో నాటుతున్నా. పండించిన కూరగాయలను శ్రీనగర్, మల్లంపల్లి, ములుగు, నర్సంపేట ప్రాంతాల్లో టోకుగా అమ్ముతున్నా. నాకున్న ఐదెకరాలకు రైతుబంధు పథకం వర్తిస్తున్నది. ప్రభుత్వ ఆర్థిక సహాయంతో రూ.కోటితో శ్రీనగర్లో గొర్ల ఫామ్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నా. అమెరికాలో లగ్జరీ లైఫ్ కంటే తల్లిదండ్రులు కట్టిన ఇంట్లో ఉంటూ వ్యవసాయం చేస్తూ కుటుంబంతో సంతోషంగా ఉంటున్నా. దానికి కారణం సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన రైతు సంక్షేమ పథకాలే.
– గుగులోత్ లక్పతి, శ్రీనగర్, ములుగు జిల్లా
కరోనా విపత్తు ప్రపంచాన్ని కుదిపేసినప్పుడు గల్ఫ్ కార్మికుల బతుకులు ఆగమయ్యాయి. నెలలపాటు ఉపాధి కోల్పోయారు. వలస కార్మికులు దేశం విడిచి వెళ్లాలంటూ అనేక దేశాలు హుకూం జారీచేశాయి. ఇలాంటి సమయంలో దిక్కు తోచక బిక్కుబిక్కుమంటున్న కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. స్వరాష్ర్టానికి వచ్చిన కార్మికులకు ఇక్కడే ఉపాధి కల్పించింది. లాక్డౌన్ నేపథ్యంలో వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి తిరిగొచ్చిన తెలంగాణకు చెందిన నిర్మాణరంగ కార్మికుల కోసం ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)’ ఓ ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించింది. ఉపాధి కోసం చూసే కార్మికులకు, భవన నిర్మాణ సంస్థలకు మధ్య వెబ్సైట్ వారధిలా పనిచేసింది. బార్ బెండింగ్, ఎలక్ట్రిషియన్స్, ప్లంబర్స్, ఫాం వర్ కార్పెంటర్స్ తదితర వృత్తుల్లో నేరుగా న్యాక్ ద్వారా శిక్షణ పొంది ఉపాధి పొందారు. గల్ఫ్ నుంచి వచ్చిన తర్వాత ఉద్యోగం వెతుకోవడం తెలియక ఇబ్బందులు పడినవారికి ఈ వెబ్సైట్ దారి చూపింది. అనేక కంపెనీలు తమకు అవసరమైన కార్మికులను ఈ వెబ్సైట్ నుంచి ఎంపిక చేసుకొన్నాయి.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కొండాపూర్కు చెందిన న్యాలపల్లి తిరుపతి ఒకప్పుడు గల్ఫ్ కార్మికుడు. సొంతఊరిలో రెండెకరాల భూమి ఉన్నా పొట్ట చేతబట్టుకొని గల్ఫ్కు వెళ్లి కూలీగా మారారు. 30 ఏండ్లు సౌదీలో కూలీ పనులు చేశారు. సాగునీళ్లు ఉంటే ఎక్కడికీ పోయేవారు కాదు. చెరువుల్లో చుక్కనీరు లేకపోయేది. కాళేశ్వరంతో మధ్యమానేరు పరిధిలో కాల్వలు తవ్వారు. తోటపల్లి రిజర్వాయర్కు వెళ్లే కాలువ ఈ ఊరి దగ్గరినుంచే పోతుంది. దీంతో ఈ మండలంలో భూగర్భ జలాలు పెరిగాయి. ఇప్పుడు తిరుపతి సొంతభూమిలో ఎవుసం చేసుకొంటున్నాడు. కేసీఆర్ దయవల్లనే తమకు మంచిరోజులొచ్చాయంటున్నాడు.
2002లో నేను దుబాయ్కు పోయే టైంలో సాగు నీళ్లు లేవు. కరెంటు ఉండేది కాదు. గిట్టుబాటు ధర ఇచ్చేటోళ్లు కాదు. రాజేశ్వర్రావుపేట మీదికెళ్లే వరద కాలువ పోయినా చుక్క నీళ్లుండేవి కాదు. ఎందుకు తవ్విండ్రో అనుకొనేటోన్ని. తెలంగాణ అచ్చినంక వరద కాలువ మీదనే పంప్హౌస్లు కడుతుండ్రని దుబాయ్లో ఉన్నప్పుడే తెలిసింది. కాళేశ్వరం నీళ్లు కాలువ కెళ్లి మీదికి ఎక్కించుడు మొదలుపెట్టడంతో మా ఊరికే పేరొచ్చింది. సీఎం కేసీఆర్ సార్, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్ ఇస్తుండని దుబాయ్లో అందరు అనుకునుడు మొదలువెట్టిండ్రు. ఎట్లయితే అట్లయింది, నీళ్లు అచ్చినయి, కరెంట్ వచ్చింది అంటే వ్యవసాయం చేసుకుంటా అని 2020లో ఇంటికి వచ్చేసిన. ఎవుసం చేసుకుంటున్న. పద్దెనిమిదేండ్ల వనవాసం ముగిసినట్టు అన్పిస్తుంది. రెండేండ్ల నుంచి రాజ్యం పాలిస్తున్నానని చెప్పను గనీ, రంది లేకుండా బతుకున్న.
– బాసనపల్లి శ్రీనివాస్. రాజేశ్వర్రావుపేట, ఇబ్రహీంపట్నం మండలం, జగిత్యాల జిల్లా
నేను 1997 నుంచి దుబాయ్, ఖతార్, బహ్రెయిన్ దేశాల్లో జీవనోపాధి కోసం 20 ఏండ్లు తిరిగిన. ఎన్నేండ్లు కష్టపడ్డా సంపాదించింది అంతంతే. అప్పుడు ఇక్కడ ఎవుసానికి అనుకూలంగా లేక పంటలు పండకపోయేవి. 2018లో తిరిగివచ్చే సరికి ఇక్కడ పంటలు చూశాను. మళ్లీ గల్ఫ్ దేశాలు వెళ్లకుండా నాకున్న రెండెకరాలతోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని పంటలు పండిస్తున్నా. చెరువుల్లో నీళ్లు నిండినయ్. మిషన్ కాకతీయ వల్ల చెరువుల్లో పూడిక పోయింది. రెండు పంటలకు పుష్కలంగా నీరందుతున్నది. బోరుబావుల్లో కూడా భూగర్భజలాలు భారీగా పెరగడంతో నీటి కొరతే లేకుండా పోయింది. 24 గంటల విద్యుత్తు సరాఫరాతో వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయాయి. పంట పెట్టుబడికి సర్కారు రూ.10 వేలు ఇస్తున్నది. పరాయిదేశం ఇంకెందుకు పోవుడు.
– కుమ్మరి శ్రీనివాస్, మాదాపూర్, మాక్లూర్ మండలం, నిజామాబాద్ జిల్లా
నేను సౌదీకి వెళ్లేటప్పుడు ఊర్లో తీవ్ర కరువు ఉండే. ఎవుసం చేయడానికి నీళ్లు లేవు. భూములన్నీ పాడువడి ఉన్నయ్. చేసుకుందమంటే ఇక్కడ పనిలేక, బతుకుదెరువు కోసం సౌదీకి వెళ్లిన. ఏడాది కిందనే ఊరికొచ్చి మల్ల ఎవుసం మొదలుపెట్టిన. సీఎం కేసీఆర్ కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు కట్టడంతో చెరువులు, కుంటల నిండా నీళ్లున్నయి. భూగర్భజలాలు పుష్కలంగా పెరిగినయ్. అప్పుడు ఎరువులు దొరుకక, కరెంట్ రాక, పెట్టుబడి కోసం అప్పులు తెచ్చి మస్తుమంది రైతులు నా కండ్ల ముంగటనే పురుగుల మందు తాగి సచ్చిపోయిండ్రు. ఇప్పుడా పరిస్థితి లేదు. రైతులకు పెట్టుబడి సాయం వస్తాంది. రైతుబీమా, సరిపడా ఎరువులు, పండిన పంటకు గిట్టుబాటు ధర అందుతాంది. ఇంతమంచిగా సౌకర్యాలు ఉండడంతోనే నాలెక్క దేశం విడిచిపోయినోళ్లంతా తిరిగి ఊర్లల్లకొచ్చి ఎవుసం చేస్తున్నరు
– అబ్దుల్ రహమాన్, రైతు, మద్దూరు, సిద్దిపేట జిల్లా
కేసీఆర్ పథకాలే విదేశాలకు వెళ్లకుండా చేశాయి నా పేరు ఎగ్గం విఠల్. మాది నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కే). 2008కు ముందు ఇక్కడ పనిలేకుండే. 2009లో సౌదీ వెళ్లా. ఎలక్ట్రిషియన్గా చేరా. 2017లో వచ్చిన. ఎవుసానికి ప్రాధాన్యం పెరగటంతో మళ్లీ పోవాలనిపించలేదు. నాకున్న ఎకరం 9 గుంటలతో పాటు, కొత్తగా ఐదెకరాలు కొన్నా. ఆరు బర్రెలు కొన్నా. ఉపాధిపథకం కింద పశువుల షెడ్డు కోసం సర్కారు రూ.20 వేలు ఇచ్చింది. బోరు వేయించిన. ఏటా ఖర్చులు పోగా రూ.2 లక్షల నుంచి 3 లక్షలు మిగులుతున్నాయి. మళ్లీ గల్ఫ్ పోవాలన్న ఆలోచన రాలేదు. ఇగ పోను.
– ఎగ్గం విఠల్, రైతు, పార్డి(కే), కుభీర్ మండలం, నిర్మల్ జిల్లా
కలలో కూడా నీళ్లు చూస్తామనుకోలేదు. తాగడానికే నీళ్లు లేకుండేవి. ఇప్పుడు సాగునీళ్లు కూడా పుష్కలం, దీనికితోడు రైతుబంధు పథకం కింద పైసలు ఇస్తుండటం ఆనందంగా ఉన్నది. పన్నెండేండ్ల కిందట ఈ పరిస్థితి ఉంటే నేను సౌదీకి వెళ్లి అక్కడ కూలీ పని చేసుకొనేటోన్నే కాదు. ఇక్కడే నాకున్న భూమిలో రాజులా బతికేవాడిని. కేసీఆర్ చల్లగుండాలే. అన్ని మంచిగ చేస్తుండు. ఎక్కడ ఇన్ని పథకాలు లేవు. తెలంగాణ మాదిరిగా ఎక్కడా అభివృద్ధి లేదు. మేమైతే ఇప్పుడు సంతోషంగా ఉన్నాం.
-నేనావత్ లక్ష్మణ్, చిట్యాల తండా, వనపర్తి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ తంగడపల్లికి చెందిన జిట్ట రమేశ్యాదవ్ తన మూడెకరాల భూమిలో పంటల సాగుకు కొన్నేండ్ల కిందట 3 బోర్లు వేశారు. చుక్కనీరు రాలేదు. అప్పులపాలై, బతుకుదెరువు కోసం దుబాయికి వెళ్లారు. 17 ఏండ్లు అక్కడే పనిచేశారు. రైతుబంధు వల్ల దుబాయ్ వెళ్లడం మానేశారు. ఉన్న భూమిలోనే వ్యవసాయం మొదలుపెట్టారు. బోరు తవ్విస్తే పుష్కలంగా నీరు పడింది. వరి సాగుచేస్తూనే బర్రెలను కొని స్థానిక పాలకేంద్రంలో అమ్మి నెలకు రూ.20 వేలు సంపాదిస్తున్నారు. ట్రాక్టర్ కొన్నారు. మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకొని వరిసాగు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చారని కృతజ్ఞతలు తెలిపారు.