లక్షెట్టిపేట, మార్చి 10 : నిజామాబాద్ నుంచి క్యాతన్పల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవేకు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని లక్షెట్టిపేట, పోతపల్లి, ఇటిక్యాల, సూరారం, గుల్లకోట గ్రామాల ప్రజలు తెగేసి చెప్పారు. ఆదివారం భూ సర్వేకు వస్తున్నారని తెలిసి లక్ష్మీపూర్ స్టేజీ వద్ద జాతీయ రహదారిపై గంటపాటు రాస్తారోకో చేశారు.
గతంలో ఎల్లంపల్లిలో చేపట్టిన శ్రీపాదరావు ప్రాజెక్టు కోసం భూములిచ్చామని, ఇగ ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకొని బతుకుతుంటే.. అవి కూడా లాక్కుంటే ఎలాగని ప్రశ్నించారు. గ్రీన్ఫీల్డ్ హైవే వద్దే వద్దంటూ నినాదాలు చేశారు. లక్షెట్టిపేట సీఐ నరేందర్, ఎస్సై చంద్రకుమార్ బాధితులతో మాట్లాడారు. 12న అధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.