చెన్నూర్ రూరల్, డిసెంబర్ 19 : బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్కు మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం లంబాడిపల్లిలో చేదు అనుభవం ఎదురైంది. ‘ఎంపీగా ఉన్నప్పుడు ముఖం చూపని నీవు, మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా ఇప్పుడు ఊర్లకు వస్తున్నావా?’అని నిలదీశారు.ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బీజేపీ కార్యకర్త ప్రవీణ్ను పరామర్శించడానికి ఆదివారం రాత్రి వివేక్ గ్రామానికి వచ్చాడు. అతడికి రూ. 2 వేల విలువైన వస్తువులు ఇవ్వడంపై స్థానికులు పెదవి విరిచారు.
ఆలయ నిర్మాణానికి రూపాయి సాయమందించలేదని, గ్రామాభివృద్ధికి, గుడి నిర్మాణానికి చొరవ చూపలేదని, ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చావంటూ వారు నిలదీశారు. వివేక్ కలుగజేసుకొని ఆలయ నిర్మాణానికి రూ.లక్ష ఇచ్చినట్టు తెలిపాడు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కృషితో గ్రామం అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నదని, ఇప్పటికే ప్రభుత్వం నుంచి రూ.కోటి మంజూరు చేయించారని వారు స్పష్టం చేశారు. ‘మీరు ఎంపీగా ఉన్న సమయంలో ఒక్కసారైనా లంబాడిపల్లికి వచ్చారా?’ అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు చేయని అభివృద్ధి.. ఇప్పుడెలా చేస్తావని నిలదీశారు. మాజీ ఎంపీ వివేక్ పచ్చి అబద్ధాల మనిషి అని సర్పంచ్ లక్ష్మీప్రియ, ఎంపీటీసీ సభ్యులు నగావత్ శ్రీనివాస్ విమర్శించారు.