హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): వంటనూనెలు సహా 23 రకాల సామగ్రిని విక్రయిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ఫెడ్ తాజాగా ‘విజయ’ పేరుతో సన్నబియ్యాన్ని విపణిలోకి తీసుకొచ్చింది. హెచ్ఎంటీ, సోనామసూరి రెండు రకాల బియ్యాన్ని గురువారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని విజయ ఔట్లెట్లో ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎండీ సురేందర్ మార్కెట్లోకి విడుదల చేశారు. 5 కేజీల నుంచి 26 కేజీల వరకు బ్యాగులు అందుబాటులో ఉన్నాయి.
ఈ సందర్భంగా చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన బియ్యం సరసమైన ధరలకే అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకొంటున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ సుధాకర్రెడ్డి, మేనేజర్లు తిరుమలేశ్రెడ్డి, సత్యనారాయణ, సంపత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.