హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సింహాచలంలోని ప్రసిద్ధ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అపచారం జరిగింది. స్వామి నిజరూప దర్శనాన్ని ఎవరో వీడియో తీసి షేర్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అప్పన్నస్వామి గర్భాలయాన్ని, మూలవిరాట్ను ఫొటోలు, వీడియోలు తీయడం నిషేధం.
స్వామివారి నిజరూప దర్శనం కోసం ప్రజలు ఏడాది పొడవునా ఎంతగానో ఎదురుచూస్తారు. అక్షయ తృతీయనాడు మాత్రమే లభించే స్వామి నిజరూప దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అంతటి పవిత్రమైన స్వామివారి నిజరూప దర్శనం బయటకు రావడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. నిరుడు కూడా గర్భాలయాన్ని వీడియో తీసిన ఆకతాయిలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఆ నిందితులను అధికారులు ఇప్పటివరకు గర్తించలేదు. ఆలయంలోని భద్రతా లోపాలపై వివిధ రాజకీయ పక్షాల నేతలు, ప్రజాప్రతినిధులు, భక్తులు మండిపడుతున్నారు.c