హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): మానవ మనుగడకు చెట్లు జీవనాడులని విపక్ష పార్టీల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా పేర్కొన్నారు. ఢిల్లీలోని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు నివాసంలో రాజ్యసభసభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త సంతోష్కుమార్, ఇతర టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి శుక్రవారం ఆమె మొక్కలు నాటారు. అనంతరం మార్గరెట్ అల్వా మాట్లాడుతూ.. ఒకప్పుడు కాలుష్యరహితంగా ఉండే ఢిల్లీ ఈ రోజు కాలుష్య కార్ఖానాగా మారిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. మనం చూస్తుండగానే ఢిల్లీలోకి ఆక్సిజన్ సెంటర్లు వచ్చాయని గుర్తుచేశారు. ఈ కాలుష్యం ఇలాగే పెరుగుతూ పోతే భవిష్యత్ తరాల పరిస్థితి ఊహించుకొంటేనే భయానకంగా ఉన్నదని ఆదోళన వ్యక్తంచేశారు.
మనం ఎప్పుడో మేలుకొని చేయాల్సిన కార్యాన్ని ఈ రోజు ఎంపీ సంతోష్కుమార్ తన భూజాన వేసుకొన్నారని పేర్కొన్నారు. గ్రీన్ చాలెంజ్లో భాగంగా సంతోష్ దేశమంతా మొక్కలు నాటిస్తున్నారని అభినందించారు. మనిషి శాశ్వతం కాదని, కానీ భవిష్యత్ తరాల బాగుకోసం చేసే ఇలాంటి కార్యాలు ఎప్పుడూ ప్రజల హృదయంలో పదిలంగా ఉంటాయని చెప్పారు. ఇంత అద్భుత కార్యక్రమాన్ని నడిపిస్తున్న సంతోష్కుమార్కు మార్గరెట్ అల్వా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలంతా బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు దీవకొండ దామోదర్రావు, కేఆర్ సురేశ్రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, వద్దిరాజు రవిచంద్ర, రంజిత్రెడ్డి, బీబీ పాటిల్, రాములు, పసునూరి దయాకర్ పాల్గొన్నారు.