హైదరాబాద్, మార్చి 4 (నమస్తేతెలంగాణ):పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కించపరుస్తూ మాట్లాడటం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, ప్రాంతీయ పార్టీ కాదన్న విషయం రేవంత్ గుర్తుపెట్టుకోవాలని చెప్పా రు. ఇలాంటి మాటలు కాంగ్రెస్ సంస్కృతి కాదని చెప్పారు. రాష్ట్రంలో పనిచేస్తున్న బీహార్కు చెందిన సివిల్ సర్వీసెస్ అధికారులు కాంగ్రెస్ హయాంలోనే వచ్చారని గుర్తుచేశారు. తెలంగాణలో దాదాపు 20 లక్షల మంది బీహారీలు పనిచేస్తుండగా, తెలుగువాళ్లు కూడా బీహార్లో పనిచేస్తున్నారని అన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై బీహార్ నుంచి తనకు అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. నాలుగు పార్టీలు మారిన రేవంత్కు పీసీసీ ఇవ్వడం పాత కాంగ్రెస్ వాదులకు ఇష్టం లేకపోయినా సోనియాగాంధీ నిర్ణయాన్ని గౌరవించామని తెలిపారు.
రేవంత్తో కలిసి పని చేద్దామనుకున్నా.. ఆయన తీరువల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. ఎన్నిసార్లు చెప్పినా రేవంత్ ఒంటెత్తు పోకడలు మానడంలేదని మండిపడ్డారు. టీడీపీ నుంచి వచ్చిన వారినే రేవంత్ ప్రోత్సహిస్తున్నాడని తప్పుపట్టారు. టీ కాంగ్రెస్ను టీడీపీ కాంగ్రెస్గా మారుస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రులు ఎవరున్నా.. పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు చెప్తామని, పిండాలు పెట్టే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కాదని చెప్పారు. రేవంత్రెడ్డి తీరు, మాటలు, ప్రవర్తనతో పార్టీకి ప్రజలు దూరమయ్యే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్పై ఎంఐఎం అధినేత అసద్ ఆగ్రహం
ఐఏఎస్లపై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. ట్విట్టర్ వేదికగా శుక్రవారం ఆయన స్పందిస్తూ.. ఐఏఎస్లు, ఐపీఎస్లు తమకు కేటాయించిన క్యాడర్లో పనిచేస్తారని తెలిపారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలు వారి మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రాంతీయ వాదానికి చోటులేదని చెప్పారు. ఒక్కసారి గండిపేట నీళ్లు తాగితే వాళ్లంతా ఇక్కడివాళ్లయిపోతారని తెలిపారు.