చౌటుప్పల్ రూరల్, జనవరి 12 : సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నగరం పల్లెకు పోతున్నది. హైదరాబాద్ వాసులు ఆంధ్రప్రదేశ్లోని తమ సొం తూళ్లకు వెళ్తుండటంతో 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అయితే.. అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఎన్హెచ్ఏఐ, జీఎమ్మార్, పోలీసు సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ట్రాఫిక్ నియంత్రణకు అదనపు సిబ్బందిని నియమించారు. ఈ టోల్ప్లాజా వద్ద మొత్తం 16 టోల్ కౌంటర్లు ఉండగా.. విజయవాడ వెళ్లేందుకు ప్రస్తుతం 10 కౌంటర్లను తెరిచారు. గతంలో మూడు సెకండ్లు ఉన్న ఫాస్టాగ్ సెన్సర్ను ప్రస్తుతం రెండు సెకండ్లకు కుదించారు. రెండు సెకన్ల వ్యవధిలోనే వాహనాలు టోల్ప్లాజా నుంచి బయటకు వెళ్తున్నాయి. ఇలా నిమిషానికి 20 వాహనాలు టోల్ ప్లాజా నుంచి బయటపడుతున్నాయి. కాగా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. స్థానిక బస్టాండ్, తంగడపల్లి, నాగారం క్రాస్ల వద్ద రాకపోకలతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతున్నది.