కృష్ణకాలనీ, నవంబర్ 26 : కేంద్రంలోని బీజేపీ సర్కార్ భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నదని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో నిర్వహించిన టీఎస్ ఎమ్మార్పీఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. లౌకికదేశాన్ని హిందూ దేశంగా మారుస్తామని, జై శ్రీరాం అంటేనే ఈ దేశంలో ఉండాలనడం దారుణమన్నారు.
దేశంలో మహ్మదీయ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ య్ వ్యాఖ్యలు దేశ భద్రతకు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కార్మిక, కర్షక ప్రయోజనాలు దెబ్బతినేలా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీ నాయకులను దళితవాడల్లోకి రానీయకూడదన్నారు. మోదీ సర్కార్ ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్పరం చేయడంతోపాటు విద్యాసంస్థల్లో ఉన్న రిజర్వేషన్లను ఎత్తివేయాలని చూడటం దారుణమన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై నిత్యం దాడులకు తెగబడుతూ, దళితులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.