ముషీరాబాద్, జూన్ 24: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువకుల ఉద్యోగకల్పనను దెబ్బతీసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్రలు చేస్తున్నదని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్రలో భాగంగానే మోదీ ప్రభుత్వం అగ్నిపథ్ను ప్రవేశపెడుతున్నదని మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్ విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.
అగ్నిపథ్ పేరుతో అట్టడుగు, వెనకబడిన వర్గాల యువకుల ఉద్యోగ భద్రతనను దెబ్బతీయడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ పని చేస్తున్నదని ధ్వజమెత్తారు. వెనకబడిన వర్గాల వారు అధికంగా పని చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నదని దుయ్యబట్టారు. బడుగు, బలహీన వర్గాలకు నష్టంచేసే చర్యలకు పాల్పడుతున్న బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అట్టడుగు వర్గాలు అభివృద్ధిలోకి వస్తాయన్న కారణంతోనే ఎస్సీ వర్గీకరణ చేయట్లేదని విరుచుకుపడ్డారు. బీజేపీ దళిత వ్యతిరేక చర్యలను మానుకోకపోతే ఆ పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కొల్లూరి వెంకట్, వరిగడ్డి చందు, వెంకన్న, నాగరాజు, సురేశ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.