హైదరాబాద్: విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు 3 గంటలపాటు ఆలస్యంగా నడువనుంది. బుధవారం ఉదయం హైదరాబాద్ సమీపంలోని ఘట్కేసర్ వద్ద గోదావరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. దీంతో రైలు పట్టాలు దెబ్బతిన్నాయి. ఈనేపథ్యంలో రైల్వే అధికారులు పలు రైళ్లను రీషెడ్యూల్ చేయడంతోపాటు మరికొన్ని రైళ్లను రద్దుచేశారు. పలు రైళ్లను దారిమళ్లించారు. దీంతో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్ రైలు.. ఉదయం 8.45 గంటలకు ప్రారంభం కానుంది. దీంతో మధ్యాహ్నం 2.15 గంటలకు బదులుగా మధ్యాహ్నం 5 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనున్నది.
సాధారణంగా వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు.. ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. మధ్యలో రాజమండ్రి (7.55 గంటలు), విజయవాడ (10 గంటలు), ఖమ్మం (11 గంటలు), వరంగల్ (12.5 గంటలు) స్టేషన్లలో ఆగి 14.15 గంటలకు (మధ్యాహ్నం 2.15కు) సికింద్రాబాద్ చేరుకుంటుంది.
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ (12727) రైలుకు బుధవారం ఉదయం పెనుముప్పు తప్పింది. రైలు విశాఖ నుంచి మంగళవారం సాయంత్రం బయలుదేరింది. బుధవారం ఉదయం 6.09 గంటలకు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అంకుషాపూర్ వద్దకు చేరుకోగానే ఆరు బోగీలు అదుపు తప్పి రైలు నిలిచిపోయింది. ఎస్-1 నుంచి ఎస్ 4 వరకు, 2 జనరల్ బోగీలు పట్టాలు తప్పి 400 మీటర్ల వరకు దూసుకెళ్లాయి. 400 మీటర్ల పొడవునా పట్టాలు ధ్వంసమయ్యాయి.
అయితే రైలు పట్టాలు తప్పినా బోల్తా పడకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రయాణికులను మిగతా 18 బోగీల ద్వారా హైదరాబాద్కు తరలించారు.