వనపర్తి, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): వనపర్తి జిల్లా కేంద్రంలోని కౌంటింగ్ కేంద్రం నుంచి ఇంటికి వెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వాహనంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడిన క్రమంలో తాను ప్రజల తీర్పును శిరసావహిస్తానని నిరంజన్రెడ్డి మీడియా ముందు ప్రకటించారు. అనంతరం కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో కౌంటింగ్ కేంద్రం గేటు బయట కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు.
చేతులతో కారు అద్దాలను పగులగొట్టి.. కర్రలతో దాడికి పాల్పడగా వాహన అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు వెంటనే వారిని అదుపు చేసి నిరంజన్రెడ్డి వాహనాన్ని పంపించారు. దాడులకు పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్థానిక అంబేద్కర్ చౌక్లో మూడు గంటలపాటు ధర్నాకు దిగారు. ప్రశాంతంగా ఉండే వనపర్తిలో కొట్లాటల సంస్కృతికి కాంగ్రెస్ తెరలేపిందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు అరాచకాలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఆనందరెడ్డి హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనను విరమించారు. ఈ ఆందోళనలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.