కరీంనగర్ : అన్ని మతాల వారికి వైకుంఠ ధామాలకు స్థలాలు ఇచ్చి వైకుంఠ ధామాలు నిర్మింప చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.బుధవారం హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా ఆధునీకరించిన వైకుంఠధామాన్ని మంత్రి గంగుల ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరీంనగర్ ప్రజలకు గతంలో మానేరు వాగు ఒడ్డున ఒకటే స్మశాన వాటిక ఉండేదని, దీనివల్ల ప్రజలకు అనేక ఇబ్బందులు కలిగే వని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో మరణించిన వారి అంత్యక్రియలు మంచిగా నిర్వహించేకునేందుకు వీలుగా అన్ని మతాల వారికి వైకుంఠధామాల కోసం స్థలాలు ఇస్తున్నారని తెలిపారు.
హౌసింగ్ బోర్డు వద్ద 7 ఎకరాల స్థలంలో రూ. 2.65 కోట్లతో వైకుంఠధామం ఆధునికరించామని మంత్రి పేర్కొన్నారు. గతంలో ఇద్దరికి మాత్రమే అంత్యక్రియలు నిర్వహించుకునే అవకాశం ఉండగా.. ప్రస్తుతం 5 గురికి అంత్యక్రియలు నిర్వహించుకునేలా ఆధునీకరించామన్నారు.
అలకాపురి కాలనీలో రూ. 2 కోట్లు, కార్ఖానా గడ్డ లో రూ. 2 కోట్లు, సప్తగిరి కాలనీలో రూ. ఒక కోటి ముస్లింల కోసం రూ. 50 లక్షలు, క్రైస్తవుల కోసం రూ. 50 లక్షల చొప్పున మొత్తంగా రూ 13. 65 కోట్లతో అన్ని మతాల వారికి వైకుంఠ ధామాలు ఆధునిక రించినట్లు మంత్రి వివరించారు.
కార్యక్రమంలో నగర మేయర్ వై. సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, స్థానిక కార్పొరేటర్ ఆకుల పద్మ, నగరపాలక సంస్థ కమిషనర్ సేవ ఇస్లావత్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.