హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రవాణా శాఖలో పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఓవైపు ‘సారథి’ పోర్టల్ సేవల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని వాహనదారులు మొత్తుకుంటుంటే అవేమీ పట్టనట్టు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సోమవారం నుంచి‘వాహన్’ పోర్టల్ సేవలను ప్రారంభించేందుకు రవాణా శాఖ ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. ఇకపై వాహన రిజిస్రేషన్, ట్రాన్సఫర్, పర్మిట్ల జారీ, ఫిట్నెస్ టెస్టులు తదితర కార్యకలాపాలన్నీ ఇందులోనే జరుగుతాయి. ‘వాహన్’ సేవలు అందుబాటులోకి వస్తే తెలంగాణ ఆర్టీఏ వ్యవహారాలన్నీ కేంద్ర ప్రభుత్వ పోర్టల్లోకి వెళ్లినట్టే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ‘సారథి’ పోర్టల్లో వాహనదారులు లైసెన్స్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలంటే సాంకేతిక సమస్యలు చుక్కలు కనిపిస్తున్నాయి.
40% లైసెన్సుల డాటా ఆ పోర్టల్లో నమోదు కాలేదని చెప్తున్నారు. దీంతో చాలా మంది వాహనదారులు తమ లైసెన్స్ గడువు ముగిశాక స్లాట్ బుకింగ్కు ప్రయత్నిస్తే ‘నో డాటా’ అని చూపుతున్నది. ఫలితంగా వాహనదారులు రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తున్నది. ‘సారథి’ పోర్టల్లో తమ వివరాలు రావడం లేదని ఉన్నతాధికారులను సంప్రదిస్తే.. ఆ విషయమై ఢిల్లీకి మెయిల్ చేయాల్సి ఉంటుందని, అందుకు సమయం పడుతుందని చెప్పి పంపుతున్నారు. గతంలో సీఎఫ్ఎస్టీ పోర్టల్లో సేవలు పారదర్శకంగా ఉండేవి. ఎవరికి వారు సొంతగా స్లాట్ బుక్ చేసుకునే వీలుండేది. ఆ పోర్టల్లో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు వాహనదారులు రవాణా శాఖ కార్యాలయాన్ని సంప్రదిస్తే వెంటనే సమస్యలు పరిష్కారమయ్యేవి.
కానీ, ఇప్పుడు ‘సారథి’ పోర్టల్లో స్లాట్ బుక్ కావాలంటే అడుగడుగున సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఆ చికాకులను భరించలేక నెట్ సెంటర్లను సంప్రదిస్తే స్లాట్ బుకింగ్కు రూ.300 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ తతంగం ముగిసేందుకు దాదాపు 40 నిమిషాల సమయం పడుతున్నది. అలా స్లాట్ బుక్ చేసుకుని రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్తే అక్కడ కూడా టెక్నికల్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఓటీపీలు ఆలస్యంగా వస్తుండటంతో సేవలు సకాలంలో అందడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ‘వాహన్’ పోర్టల్ను ప్రారంభించి వాహనదారులకు మరో పరీక్ష పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సీఎఫ్ఎస్టీ పోర్టల్ను పునఃప్రారంభించాలి
సాంకేతిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ‘సారథి’ పోర్టల్ పనితీరుపై వాహన సంఘాల జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పోర్టల్ను రద్దు చేయాలని, బీఆర్ఎస్ హయాంలో ఉన్న సీఎఫ్ఎస్టీ పోర్టల్ను మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అలా కాకుండా ‘వాహన్’ పోర్టల్ను అందుబాటులోకి తెస్తే ఇంకెన్ని సమస్యలు వెంటాడుతాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే రవాణా శాఖ జాయింట్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు.