హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో థర్డ్ వేవ్ ముగిసిపోయినట్టేనని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు. కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని, పాజిటివిటీ రేటు 2 శాతానికి తగ్గిందని చెప్పారు. ఇది రాష్ర్టానికి శుభ సూచకమని, ప్రజలు స్వేచ్ఛగా తమ రోజువారీ పనులు చేసుకోవచ్చని తెలిపారు. వర్క్ ఫ్రం హోం అవసరం లేదని, కంపెనీలు సిబ్బందిని పూర్తిస్థాయిలో రప్పించాలని కోరారు. విద్యాసంస్థల్లోనూ ఆన్లైన్ క్లాసులు అవసరం లేదని, విద్యార్థులు నేరుగా తరగతులకు హాజరు కావాలని చెప్పారు. మంగళవారం కోఠిలోని తన కార్యాలయంలో శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. మొదటి వేవ్తో దాదాపు 10 నెలలు ఇబ్బంది పడ్డామని, రెండో వేవ్ దాదాపు 6 నెలలు కొనసాగిందని, మూడో వేవ్ మాత్రం రెండు నెలల్లోనే అదుపులోకి వచ్చిందని వివరించారు. వేవ్ ప్రారంభమైన 28 రోజుల్లోనే పతాకస్థాయిలో కేసులు నమోదయ్యాయని, అత్యధికంగా జనవరి 25న 4,800 కేసులు వెలుగుచూశాయని తెలిపారు. వచ్చే వారం నుంచి రోజువారీ కేసులు 100 వరకు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. థర్డ్ వేవ్ నియంత్రణలో వ్యాక్సిన్ కీలక ఆయుధంగా పనిచేసిందని, ఇప్పటివరకు 5 కోట్లకు పైగా టీకాలు పంపిణీ చేశామని వివరించారు. రాష్ట్రంలో 82% మందికి రెండు డోస్లు వేశామని అన్నారు. నిజామాబాద్, ఆసిఫాబాద్ మినహా మిగతా జిల్లాల్లో 100% తొలి డోస్ పంపిణీ పూర్తయిందని తెలిపారు. టీకా తీసుకోనివారిలో 2.8% మంది దవాఖానలో చేరారని వెల్లడించారు. ఫీవర్ సర్వేతో మంచి ఫలితాలు వచ్చాయని, 4 లక్షలకుపైగా కిట్లను పంపిణీ చేశామని, ఈ సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
కొన్ని కీలక అంశాలు..
వైద్యశాఖకు రూ.49 కోట్లు విడుదల
వైద్యారోగ్యశాఖకు రాష్ట్ర ప్రభుత్వం రూ.49 కోట్లు విడుదల చేసింది. బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా వైద్య విద్య విభాగానికి ఈ నిధులను కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. బడ్జెట్లో మొత్తం రూ.89 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.40 కోట్లు మంజూరుచేసింది.
థర్డ్ వేవ్లో ఇలా..