హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): శృతిమించితే ఏదీ మంచిది కాదు. కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు అతిగా ఆవిరి పట్టడం వల్ల కూడా దుష్ఫలితాలు వస్తాయని ఉస్మానియా జనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన డాక్టర్ ప్రతిభా లక్ష్మి స్పష్టం చేశారు. కొవిడ్పై ప్రజలు అనవసరంగా భయాందోళనకు గురవుతున్నారని, ఎవరు ఏది చెప్పినా నమ్మి.. ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో 90 శాతం మందికి స్వల్ప లక్షణాలతోనే వ్యాధి తగ్గిపోతుందన్నారు. మిగిలిన 10 శాతం మందిలో ఇతర వ్యాధులు, అనారోగ్య సమస్యల వల్ల కొవిడ్ తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పారు. ఇలాంటి వారంతా దవాఖానకు వెళ్లాల్సి ఉంటుందని, అంతేతప్ప ఆవిరి పీల్చడం, కషాయం లేదా వేడి నీళ్లు తాగడం వల్ల ప్రయోజనమేమీ ఉండదని తెలిపారు. మనలో రోగ నిరోధకశక్తి బలంగా ఉంటే శరీరంలో ప్రవేశించిన 9 రోజులకే కరోనా వైరస్ అంతరించిపోతుందని డాక్టర్ లక్ష్మి పేర్కొన్నారు.
ముక్కు దిబ్బడ ఉంటేనే
ముక్కు దిబ్బడ ఎక్కువగా ఉన్నవారు మాత్రమే రెండ్రోజులపాటు ఉదయం 5 నిమిషాలు ఆవిరిపట్టాలని డాక్టర్ ప్రతిభాలక్ష్మి అన్నారు. అది కూడా కేవలం నీటితోనే ఆవిరి పట్టాలని.. కర్పూరం, ఆయిల్ బేస్ట్ (గ్రీన్ కలర్ ట్యాబ్లెట్లు) మందులు వినియోగించరాదని స్పష్టంచేశారు.
కరోనాను ఆవిరి అడ్డుకోదు
ఆవిరి పట్టడం వల్ల కరోనా రాదని, రోజూ ఆవిరి పడితే కరోనా తగ్గిపోతుందని భావించడం సరికాదన్నారు. నిజానికి ఆవిరి వల్ల కరోనాపై ఎలాంటి ప్రభావం ఉండదని, పైపెచ్చు వేడి ఆవిరి వల్ల మన ముక్కులోని సున్నితమైన మ్యూకస్ పొరతోపాటు దానిపై ఉండే సీలియా పాడైపోయి వైరస్ త్వరగా లోపలికి వెళ్తుందని తెలిపారు. అలాగే ఆవిరి పట్టేటప్పుడు నీటిలో పసుపు, కర్పూరం లాంటి పదార్ధాలను కలపడం వల్ల ఆక్సిజన్ శాతం పెరుగుతుందన్న అభిప్రాయంలోనూ వాస్తవం లేదన్నారు. పసుపు, కర్పూరంతో ఆవిరి పట్టడం వల్ల కండ్లు మంట పుట్టడంతోపాటు ఉబ్బసం, ఊపిరితిత్తుల్లో సమస్యలున్నవారికి ఇబ్బందులు మరింత పెరుగుతాయని డాక్టర్ ప్రతిభా లక్ష్మి తెలిపారు.