వరంగల్ : రాష్ట్రంలో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించాలనే లక్ష్యంతో నాలుగో విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమంలా నిర్వహిస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 1, 2 డివిజన్ల పరిధిలోని పెగడపల్లిలో నిర్వహించిన పట్టణ పట్టణ ప్రగతి కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యే, మేయర్ దళిత వాడలలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పారిశుధ్యం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, హరితహారం, విద్యుత్ సమస్యల పరిష్కారం మొదలగు అంశాలకు ఈ కార్యక్రమంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజా ప్రతినిధులు, అధికారులకు సూచించారు. పర్యావరణం, పారిశుద్ధ్యం, పచ్చదనంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు.
పట్టణ ప్రగతిలో అందరూ భాగస్వాములై సమగ్ర అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, రోడ్లు, నర్సరీలు, శ్మశానవాటికలు, మోడల్ మార్కెట్లు, పార్కులు, డంప్యార్డుల ఏర్పాటుకు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.