హైదరాబాద్ : నగర, పట్టణ వాసులకు శారీరక ధారుడ్యం, మానసికోల్లాసంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని చిటికెలో తెలుసుకొనే సౌలభ్యాన్ని అటవీ శాఖ అందుబాటులోకి తెచ్చింది. ప్రకృతికి దగ్గరగా వెళ్లి.. ప్రశాంతత పొందాలనుకునే పట్టణ వాసుల కోసం ఈ మొబైల్ యాప్ణు వినూత్నంగా రూపొందించారు. శుక్రవారం అరణ్య భవన్లో అటవీ శాఖ అధికారులతో కలిసి ఈ మొబైల్ యాప్ను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు.
హెచ్ఎండీఏ, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ పరిధిలో ఉన్న 39 అర్బన్ ఫారెస్ట్ పార్కులకు సంబందించిన సమాచారాన్ని ఈ యాప్లో పొందుపరిచారు. రెండవ దశలో మరిన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కుల సమాచారాన్ని ఈ యాప్లో నిక్షిప్తం చేయనున్నారు. సీఎం ఓఎస్డీ (హరితహారం) ప్రియాంక వర్గీస్ చొరవతో ఈ ప్రత్యేక మొబైల్ యాప్ను PAMTEN సంస్థ రూపొందించింది. అండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ ఫోన్లలో “URBAN FOREST PARKS” అనే ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో పార్క్ను ఒక్కో థీమ్తో అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా తీర్చిదిద్దామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కుటుంబంతో పాటు సరదగా ఈ పార్కులో సేద తీరేందుకు వచ్చే పట్టణ వాసులకు వీటి సమచారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ఈ యాప్ను రూపొందించామని ప్రియాంక వర్గీస్ వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్ శోభ, పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం.డోబ్రియల్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.